Ramoji rao: పత్రికా రంగంపై చెరగని ముద్ర

ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేంటి ‘ఈనాడు’ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే.

Updated : 08 Jun 2024 12:31 IST

Ramoji rao | ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేంటి ‘ఈనాడు’ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే. దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి.. ఆయనే రామోజీరావు (Ramoji rao). దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం అయ్యే రోజుల్లో సూర్యోదయం కాక ముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక అందించాలన్న ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈనాడు (Eenadu). నాటి నుంచి నేటి వరకు ‘ఈనాడు’ వేసిన ప్రతి అడుగూ సంచలనమే.  తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారాయన. అందుకే ఆయనను ‘మీడియా మొఘల్‌’ (media mogul) అని కీర్తిస్తారు.

ఆరంభమే సంచలనం

‘సూర్యోదయం తరువాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు’.. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. మరే పత్రికా లేని ఓ మారుమూల ప్రదేశంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు.. నేటికీ  అనంతమై నిరంతరం, తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. దిన పత్రికల పంపిణీ వ్యవస్థకు ‘ఈనాడు’ వేసిన బాటే అన్ని పత్రికలకు దారిచూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి 1977లో చరమగీతం పాడింది ఈనాడే. ఈనాడు రాకముందు పత్రికలకు పల్లెల్లో ఏజెంట్లు ఉండేవారు కాదు. ఈ సరిహద్దు రేఖను ఈనాడు దాటింది. గిరులు, ఝరులు దాటి అడవుల్లో మారు మూల దాగున్న పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకుని వాలిపోయింది. అప్పటి వరకు బస్సులు, రైళ్లు, తపాలా ద్వారా మాత్రమే సాగుతున్న పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. సొంతంగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేసింది. ఇది పత్రికా ప్రపంచంలోనే పెను సంచలనం. తొలినాళ్లలో ఐదారు వేల కాపీలతో ప్రారంభమై.. ఆ తర్వాత కొన్నేళ్లలోనే తెలుగులోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికగా పేరొందింది.

కార్మికుడితో స్విచ్‌ ఆన్‌..

హంగూ ఆర్భాటం లేకుండా ఒక సాధారణ కార్మికుడే స్విచ్‌ఆన్‌ చేసి ‘ఈనాడు’ను ప్రారంభించారు. వ్యవహారిక భాషలో వార్త రచన, ఏ రోజు వార్తలు ఆ రోజే అన్న సూత్రాన్ని మొదటి నుంచి ఈనాడు పాటించటంతో ప్రజా బాహుళ్యంలో విశేషమైన ఆదరణ లభించింది. గ్రామీణ, స్థానిక వార్తలకు చోటు కల్పించడంతో ప్రజల పత్రికగా ప్రజా పత్రికగా ఈనాడు రూపాంతరం చెందింది. రైతులకు సంబంధించిన వార్తలు ప్రచురించడంతో ఈనాడును రైతు పక్షపాతిగా ప్రజలు ఆదరించారు. డెయిలీ సీరియల్స్‌ను పత్రికలో ప్రచురించడం ప్రవేశ పెట్టిందీ ఈనాడే. అభ్యుదయ రచనలకు ఆటపట్టుగా మారడమే కాదు.. ప్రజల అవసరాలకు విలేకరులే వెళ్లి వార్తా సేకరణ చేసేలా జర్నలిజానికి కొత్త అర్థం చెప్పిందీ ఈనాడు మాత్రమే.

రాజకీయ శక్తిగానూ..

‘ఈనాడు’ అంటే కేవలం వార్తలే కాదు తెలుగువారి ఆత్మగౌరవపతాకగా నిలిచింది. 1978-83 మధ్య నాటి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఐదేళ్లలో నలుగురు ఏపీ ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఆ సమయంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను ‘ఈనాడు’ హర్షించింది. అయితే వ్యక్తులకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి చేస్తే అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు 1983 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో స్పష్టంచేశారు. దానికి తగ్గట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ‘ఈనాడు’ అక్షర యుద్ధం చేసింది. 2003లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు విస్తృత కవరేజీ ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాల్నీ బహిర్గతం చేసింది. 2019లో జగన్‌ పాదయాత్రకూ ఈనాడు కవరేజ్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక జగన్‌ అరాచకాలను ఎండగట్టి నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో తనవంతు పాత్రపోషించింది.

మహిళలకు, పిల్లలకు ప్రత్యేక పేజీలు

మహిళల కోసం ప్రత్యేక పేజీ ఉండాలన్న ఉద్దేశంతో 1992 సెప్టెంబరు 24న ‘వసుంధర’ను ప్రారంభించింది ఈనాడు. అప్పటికి దేశంలో మరే పత్రికా ఇలా మహిళల కోసం ప్రత్యేక పేజీ ఇవ్వడం లేదు. తెలుగు మహిశా లోకమూ దీనికి సాదర స్వాగతం పలికింది. ఆ తరువాతి కాలంలో దాదాపు అన్ని ప్రాంతీయ పత్రికలూ మహిళా అనుబంధాల్ని ప్రారంభించాయి. 2002 జులై 17న ఈనాడు ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. తెలుగు పాఠకులకు వరంగా ఇంధ్ర ధనుస్సు వంటి ఏడు ప్రత్యేక పేజీలు ప్రారంభమయ్యాయి. విజ్ఞానం, ఆరోగ్యం, క్రీడలు, సాంకేతిక విజ్ఞానం, బాలల వినోదం వంటి అంశాలతో ఏడు ప్రత్యేక పేజీలుగా ఇవ్వడం ఈనాడు వినూత్న సమాచార విప్లవం. చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్‌బుజ్జీ పేజీలకు ఈనాడు శ్రీకారం చుట్టింది. ఇతర పత్రికలకు స్ఫూర్తిగా నిలిచింది.

ప్రజల గొంతుకగా..

‘ఈనాడు’ అక్షరయాత్రలో మరో సంచలనం పరిశోధనాత్మక పాత్రికేయం. ప్రజల పక్షపాతిగా నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల ఆయుధంగా ఈనాడు ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగాన్ని గట్టిగా ఎండగట్టాయి. అధికారుల అలసత్వాన్ని ప్రదర్శించాయి. అభాగ్యులకు ఆర్థిక సాయం అందేలా చేశాయి. అక్షరాలే అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్నీ ముందుకు నడిపింది ఈనాడు. 1992లో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమానికి ఊతమిచ్చింది. 1995లో ఈనాడు చేపట్టిన శ్రమదానోద్యమం ఊళ్లకు ఊళ్లను భాగస్వాముల్ని చేసింది. చెరువుల్లో పూడిక తీత, రోడ్ల మరమ్మతులు, కాలువల మరమ్మతులకు గ్రామస్థులు స్వచ్ఛందంగా కదిలేలా స్ఫూర్తినింపింది. తుపానుల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు బాసటగా నిలవడం ఈనాడులోని మానవత్వానికి నిదర్శనం. తుపాన్ల సమయంలో సంస్థ రిలీఫ్‌ ఫండ్ ప్రకటించడడం, పాఠకులూ బాధితులకు ఆపన్నహస్తం అందించేలా ప్రోత్సహించడం, ఆ వచ్చిన మొత్తంతో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా.. తుపాను బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడంలో ఈనాడు కీలక భూమిక పోషించింది.

సాంకేతికంగానూ..

పత్రికా రచనలోనే కాదు.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ముందుంది. తెలుగు దినపత్రికలన్నింటికన్నా ముందే ఇంటర్నెట్‌లోకి అడుగుపెట్టింది. 1999లో ఈనాడు.నెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠకులకు చేరువైంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ పెద్దగా వాడుకలో లేని రోజుల్లోనూ ఆన్‌లైన్‌లో తాజా వార్తలను ఇవ్వడం ప్రారంభించింది ఈనాడే. ప్రింట్‌ మీడియాలో ఈనాడు ఓ సంచలనమైతే ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ రామోజీరావు ప్రారంభించిన ఈటీవీ రూపంలో బుల్లితెర వినోదాన్ని తెలుగువారికి పరిచయం చేశారు. ‘ఈటీవీ2’ పేరుతో 24 గంటల వార్తా ప్రసారాలకూ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ తెలంగాణ పేరిట రెండు వేర్వేరు టీవీ ఛానళ్లను అందిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు ఈటీవీ నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు రామోజీరావు విస్తరించుకంటూ వెళ్లారు. ఈటీవీ ప్లస్‌, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ బాలభారత్‌, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్లకు శ్రీకారం చుట్టారు. డిజిటల్‌ రంగంలో ఈటీవీ భారత్‌ను ఆరంభించారు.

అవార్డులు 

జర్నలిజంలో విలువలను పెంచడంతో పాటు, ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చే బి.డి.గోయంకా అవార్డును 2001లో రామోజీరావు అందుకున్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ వరించాయి. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా కూడా రామోజీరావు పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని