TSRTC: పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి రానుంది.

Updated : 08 Dec 2023 20:58 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 9వ తేదీ (శనివారం) మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సు (TSRTC) ల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని తెలిపింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.

స్థానికత గుర్తింపు కార్డు చూపించి ప్రయాణించవచ్చు: ఆర్టీసీ ఎండీ

రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ‘‘మహాలక్ష్మి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభిస్తాం. మహిళా మంత్రులు, సీఎస్‌, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజా రవాణా వ్యవస్థలో చరిత్రాత్మక నిర్ణయం ఇది. ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారతకు దోహద పడుతుంది. కొవిడ్‌ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. దీని వల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. పెరుగుతున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు, కాలష్యం పెరుగుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. బస్సులో ప్రయాణించే సమయంలో ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా గుర్తింపు చూపితే సరిపోతుంది. ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ ఇస్తాం. 5.. 6 రోజుల తర్వాత ఎలక్ట్రానిక్‌ మిషన్‌ ద్వారా జీరో టికెట్‌ ప్రింటింగ్‌ చేస్తాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత దీనిపై సమీక్షించి.. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం. ప్రస్తుతం 7,200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తాం’’ అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని