చేవెళ్ల.. గులాబీ కళ

చేవెళ్ల గులాబీమయమైంది. శనివారం భారాస ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. కేసీఆర్‌ ప్రసంగం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

Updated : 14 Apr 2024 06:46 IST

చేవెళ్ల గులాబీమయమైంది. శనివారం భారాస ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. కేసీఆర్‌ ప్రసంగం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కళాకారుల ఆటాపాట  ఉర్రూతలూగించింది. వేదికపై పలువురు నాయకులు పాదం కలిపి సందడి చేశారు. ప్రాంగణమంతా లాబీ జెండాలు, కటౌట్లతో నిండిపోయింది. నాయకుల ప్రసంగాలు కార్యకర్తల్లో భరోసా కలిగించాయి.

మొయినాబాద్‌, చేవెళ్ల, న్యూస్‌టుడే


కేసీఆర్‌కు రక్షణగా బౌన్సర్లు

వేదికపై కేసీఆర్‌కు బౌన్సర్లు రక్షణగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. సీఎంగా ఉన్న సమయంలో అంతా పోలీసులే కనిపించే వారు. నార్సింగి డివిజన్‌ ఏసీపీ జీవీరమణారెడ్డి వేదిక వద్ద ఇన్‌ఛార్జి పోలీసు అధికారిగా వ్యవహరించగా.. కొంతమంది పోలీసులు మాత్రమే అక్కడ   బందోబస్తు విధులు నిర్వహించారు.

సభకు తరలివస్తున్న శ్రేణులు

 కేసీఆర్‌ సభకు హెలికాప్టర్‌లో వస్తారని ప్రాంగణం దగ్గర హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఆయన బీజాపూర్‌ రహదారి మీదుగా సభాస్థలికి చేరుకున్నారు.

  •  ‘గులాబీల జెండలమ్మ’ పాటకు ఎమ్మెల్యే యాదయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మహేష్‌రెడ్డి కండువాలు తిప్పుతూ కార్యకర్తల్లో నూతనోత్సాహం తెచ్చారు. మాజీ ఎమ్మెల్యే రసమయి పాటలతో హోరెత్తించారు.
  •  బహిరంగ సభకు వచ్చిన కేసీఆర్‌కు మాజీ మంత్రి సబితారెడ్డి, పార్టీ లోక్‌ సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు ఉమ్మడి జిల్లా నేతలు స్వాగతం పలికారు.
  •  పార్టీ వర్గాలు ఊహించినదాని కంటే ఎక్కువమంది సభకు రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభను విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ఉమ్మడి జిల్లా నేతలను ప్రత్యేకంగా అభినందించారు.

సభకు హాజరైన కార్యకర్తలు, అభిమానులు

కళాకారుల ఆటాపాట


‘‘నేను గెలిచి చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా   పరిషత్‌ ఛైర్మన్‌గా గతంలో ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేశా. చేవెళ్లలో భారాస జెండా ఎగురుతుంది.’’

 కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి


‘‘పదేళ్ల కేసీఆర్‌ పాలన ఎలా ఉందో ప్రజలంతా చూశారు. వంద రోజుల కాంగ్రెస్‌ పాలననూ గమనిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికొదిలేసింది. నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు.’’  

- సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే, మహేశ్వరం


‘‘కేసీఆర్‌ను మాజీ ముఖ్యమంత్రి     అనడానికి నాకు నోరు రావడం లేదు. నా దృష్టిలో ఆయనే సీఎం. కేసీఆర్‌ భావితరాలకు దిక్సూచి. కాంగ్రెస్‌   పాలనలో కరెంటు కోతలు మొదలయ్యాయి. మళ్లీ ఇన్వర్టర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.’’    

  - కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని