Tamilisai: 50 - 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఏఐ సిటీ: గవర్నర్‌ తమిళిసై

టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) వెల్లడించారు.

Updated : 08 Feb 2024 15:15 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) వెల్లడించారు. తెలంగాణలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాల (Telangana Assembly) ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. పెద్దఎత్తున మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనులు చేపడతామని.. ఆ నది మరోసారి హైదరాబాద్‌ జీవనాడిగా మారుతుందని చెప్పారు.

గత ప్రభుత్వ నిర్వాకాలను ప్రజలకు తెలిపాం

ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులతోపాటు అప్పటి మన్మోహన్‌ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ‘‘ప్రత్యేకించి సోనియాగాంధీ షోషించిన పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటివరకూ 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. పాలమూరు-రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తాం. మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతను పాటిస్తుంది. గత ప్రభుత్వం నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశాం. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య వర్సిటీలు ఏర్పాటు చేస్తాం.

12 ఫార్మా విలేజ్‌ క్లస్టర్లు!

విద్యతో పాటు ఉద్యోగమూ సాధించేలా యువతలో నైపుణ్యాలు పెంపునకు కృషి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, వికలాంగ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తాం. 10 నుంచి 12 ఫార్మా విలేజ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సమగ్ర డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. హైదరాబాద్‌ను దేశంలోనే కృత్రిమ మేధ (ఏఐ) ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తాం. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తాం. క్రీడారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడమే మా లక్ష్యం. కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌ కేవలం ఆర్థిక పత్రం కాదు.. భవిష్యత్‌కు నమూనా’’ అని చెప్పారు.

ఫిబ్రవరి 10న బడ్జెట్‌

గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. తొమ్మిదో తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. అదే రోజు శాసనసభ కార్యకలాపాల సలహాకమిటీ (బీఏసీ) సమావేశాన్ని నిర్వహించి, సభను ఎన్ని రోజులు నడపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక శాఖను నిర్వహించే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. బడ్జెట్‌ సమావేశాలు సుమారు 7-10 రోజుల వరకు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని