DNPA Dialogue: ఆ రెండు దేశాలను భారత్‌ అనుసరించాలి.. డీఎన్‌పీఏ సమావేశంలో వక్తలు

బిగ్‌ టెక్‌ కంపెనీలు, న్యూస్‌ పబ్లిషర్ల మధ్య ఆదాయ పంపిణీ విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం చట్టం రూపుదాల్చాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా, కెనడా దేశాలు అనుసరిస్తున్న చట్టాలను భారత్‌ సైతం అందిపుచ్చుకోవాలని సూచించారు.

Published : 26 Nov 2022 17:25 IST

దిల్లీ: బిగ్‌ టెక్‌ కంపెనీలు, న్యూస్‌ పబ్లిషర్ల మధ్య ఆదాయ పంపిణీ విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం చట్టం రూపుదాల్చాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా, కెనడా దేశాలు అనుసరిస్తున్న చట్టాలను భారత్‌ సైతం అందిపుచ్చుకోవాలని సూచించారు. డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేన్‌ (DNPA) ఆధ్యరంలో నిర్వహించిన వెబినార్‌లో ఈ మేరకు పలువురు వక్తులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

వార్తలను డిస్‌ప్లే చేసి ఆదాయాన్ని పొందుతున్న టెక్‌ కంపెనీలు పారదర్శకంగా తమ ఆదాయాన్ని న్యూస్‌ పబ్లిషర్స్‌కి పంపిణీ చేసే విధంగా ఆస్ట్రేలియా 2021లోనే చట్టం తీసుకొచ్చిందని ఆ దేశ కాంపీటీషన్‌, వినియోగదారుల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ రాడ్‌ సిమ్స్‌ అన్నారు. దీంతో ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలు ఇప్పుడు ఈ కోడ్‌లు తమకు వర్తించకుండా ఆయా మీడియా పబ్లిషర్స్‌తో ఒప్పందం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలు దారికి రావడం అంత సులువేమీ కాదని, అలాగని అది అసాధ్యం మాత్రం కాదని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖకు గతంలో సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా వ్యవహరించిన ఎమ్మా మెక్‌డొనాల్డ్‌ అన్నారు. మీడియా సంస్థలన్నీ కలిసి చట్టం చేయాలని డిమాండ్‌ చేయడంతో అది సాధ్యమైందన్నారు. ఈ కోడ్‌ వల్ల ఆస్ట్రేలియా మీడియాలో నాణ్యత పెరగడంతో పాటు నియామకాలు కూడా పెరిగాయని ఆ దేశ పబ్లిక్‌ పాలసీ క్యాంపెయినర్‌ పీటర్‌ లెవిస్‌ అన్నారు. ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని తీసుకొచ్చేందుకు కెనడా సైతం ప్రయత్నిస్తోందని ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ సీనియర్‌ లెక్చరర్‌ జేమ్స్‌ మెస్సీ అన్నారు. ఈ రెండు దేశాల్లానే భారత్‌లో సైతం చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరగాలని రాడ్‌ సిమ్స్‌ సూచించారు.

ఈ సందర్భంగా డీఎన్‌పీఏ ఛైర్మన్‌, అమర్‌ ఉజలా మేనేజింగ్‌ డైరెక్టర్‌ తన్మయ్‌ మహేశ్వరి మాట్లాడుతూ.. బిగ్ టెక్‌ కంపెనీలతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో డిజిటల్ న్యూస్ ఎకోసిస్టమ్‌లోని కొన్ని పరిమితులను విస్మరించలేమని పేర్కొన్నారు. ఏది సరైనది, ఎలా మెరుగుపడాలనేదానిపై అవగాహన కోసమే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఒకే గళం వినిపించాలంటే మీడియా సంస్థలన్నీ పరస్పర సహకరించుకోవడమే ఉత్తమమైన మార్గమని స్టార్‌న్యూస్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పాల్‌ థామస్‌ అన్నారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. డీఎన్‌పీఏలో దేశంలోని 17 ప్రముఖ మీడియా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. తదుపరి సమావేశం డిసెంబర్‌ 9న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని