MLC Kavita: కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. 

Updated : 04 Apr 2024 17:18 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు న్యాయవాదులు రిజాయిండర్‌ దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత తరఫున మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు.

అప్రూవర్‌గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారు: ఈడీ

బెయిల్‌ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘ కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. దిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారు. ఆమె తన ఫోన్‌ డేటాను డిలీట్‌ చేశారు. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. పది ఫోన్లు ఇచ్చినా అన్నీ ఫార్మాట్‌ చేసే ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను కవిత ఫార్మాట్‌ చేశారు. నిందితులు వందల డిజిటల్‌ డివైజ్‌లను ధ్వంసం చేశారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని బెదిరించారు. ఆమె చిన్న కుమారుడు ఒంటరి కాదు. సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు. కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్‌ అడిగారు. కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి’’ అని ఈడీ తెలిపింది. వాదనల అనంతరం రౌజ్‌ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఏప్రిల్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని