Kishan Reddy: రీజనల్‌ రింగ్ రోడ్డుకు రూ.26 వేల కోట్లు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణలో రైల్వేస్టేషన్‌లు తక్కువగా ఉన్నాయని.. కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 15 Feb 2024 19:18 IST

సిద్దిపేట: తెలంగాణలో రైల్వేస్టేషన్‌లు తక్కువగా ఉన్నాయని.. కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌తో కలిసి ఆయన భూమిపూజ చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.250 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు రూ.6 వేల కోట్లు ఇచ్చామన్నారు. మెదక్, సిద్దిపేట రైల్వే లైన్‌ కూడా భాజపా ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. రీజనల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం రూ.26 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించబోతుందని చెప్పారు. గత ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, కొత్త ప్రభుత్వం భూ సేకరణ చేస్తే వెంటనే ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌, జనగామ జిల్లా భాజపా అధ్యక్షుడు దశమంత్‌రెడ్డి పాల్గొన్నారు.

కొమురవెల్లి వద్ద హాల్ట్‌స్టేషన్‌ నిర్మించాలని గవర్నర్ తమిళిసై, ఎంపీ బండిసంజయ్, కిషన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భక్తులు వినతిపత్రాలు అందజేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు తీసుకెళ్లడంతో ఆలయానికి 3 కి.మీ దూరంలో స్టేషన్‌ను మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. స్టేషన్‌ ఏర్పాటుతో లక్షలాది మందికి ప్రయోజనం కలుగనుంది. స్వామి దర్శనానికి ఏటా 25 లక్షల మందికి పైగా నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. సుమారు 70 శాతం మంది సామాన్యులే ఉంటారు. వారంతా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకుంటారు. బస్సుల్లో వచ్చే వారికి రాజీవ్‌ రహదారి నుంచి 3 కి.మీ. దూరంలోని కొమురవెల్లి చేరుకోవడానికి, తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికులు ప్రధాన రహదారిపై గంటల కొద్దీ నిరీక్షించాల్సిందే. హైదరాబాద్‌ నుంచి 110 కి.మీ., కరీంనగర్‌ నుంచి 90 కి.మీ. రెండు, మూడు వాహనాలు మారుతూ ప్రయాణించాల్సిందే. హైదరాబాద్‌ నుంచి ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.150, కరీంనగర్‌ నుంచి రూ.100 ఖర్చు తప్పదు. రైలు ప్రయాణమైతే సగం భారం తగ్గే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని