KRMB: కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న వేళ కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 12 Apr 2024 20:23 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొన్న వేళ కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్‌ జలాశయంలో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలో హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్‌ కుమార్‌, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. 

జంట జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్‌ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో చర్చించారు. అక్టోబరులో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై చర్చ జరిగింది. అప్పట్లో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించగా.. అందులో తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణ అదనంగా 7 టీఎంసీలు వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. సాగర్‌ నుంచి వెంటనే తమకు ఆ 5 టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కృష్ణా జలాల్లో  ఏపీ ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకొందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌ పేర్కొన్నారు.  శ్రీశైలం నుంచి ఏపీ ఎలాంటి అవసరాలకైనా నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. సాగర్‌ దిగువన తమకు తాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సి వస్తోందని ఏపీ ఈఎన్సీ తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి వీలైనంత ఎక్కువ నీరు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్ పై ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సీ వివరించారు. హైదరాబాద్ జనాభాను పరిగణనలోకి తీసుకొని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని కోరారు. దీంతో నాగార్జునసాగర్‌లో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. మే నెలలో త్రిసభ్య కమిటీ మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని