Kavitha: బెయిల్‌ ఇవ్వలేం.. ట్రయల్‌ కోర్టుకు వెళ్లండి: కవితకు సుప్రీం సూచన

Kavitha: మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు సూచించింది.

Updated : 22 Mar 2024 13:21 IST

దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అప్రూవర్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రస్తుతానికి తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇందులో తాము బెయిల్‌ ఇవ్వలేమని, మొదట కింది కోర్టును ఆశ్రయించాల్సిందేనని తెలిపింది. ఆ స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందన్న ధర్మాసనం.. త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది. ఈ పిటిషన్‌లో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను లేవనెత్తినందున.. దీన్ని ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జతచేస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యాంగ పరమైన అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాత మరో రెండు వారాల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని