Bhadrachalam: భద్రాద్రి రామయ్య ఆలయంలో వెండి వాకిలి.. ఆనందంలో భక్తులు

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది.

Published : 07 Feb 2024 19:53 IST

భద్రాచలం: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా.. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో ఉన్న ముఖ మండపానికి దాదాపు 100 కిలోల వెండితో తాపడం తయారు చేసి వాటిని ఈ మార్గానికి అమర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్తపతి దండపాణి సారథ్యంలో శిల్పకళ ఉట్టిపడే విధంగా దీన్ని తయారు చేశారు. కోవెలలో ఉన్న 70 కిలోల పాత రజతానికి తోడు హైదరాబాద్‌కు చెందిన దాత మరో 30 కిలోల వెండిని అందించారు. స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో ఏర్పాటు చేసిన వెండి వాకిలి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

భద్రాద్రిలో ఇకపై శుక్రవారం ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ రోజు మూల విరాట్‌కు స్వర్ణ కవచాల అలంకరణ ఉంటుంది. అంతరాలయంలో పూజలు చేయించే వారు వెండి, బంగారు వాకిలి గుండా లోపలకు ప్రవేశించి మూలమూర్తులను దర్శించుకుంటారు. ఇప్పుడు శని, ఆదివారాల్లో రద్దీ నెలకొంటోంది. భవిష్యత్తులో శుక్రవారం కూడా సందడి పెరిగే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని