సిగరెట్‌ పీకలతో బొమ్మలు.. కుషన్లు!

‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్‌ ప్యాకెట్‌పైనే రాసి ఉంటుంది. కానీ, ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోరు. కొన్ని ప్రాంతాల్లో నిషేధం విధించినా సిగరెట్ల వాడకం పెరుగుతుందే గానీ.. తగ్గట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 6.5 ట్రిలియన్‌ సిగరెట్ల విక్రయాలు జరుగుతున్నాయట. అంటే.. రోజుకు

Updated : 21 Mar 2021 12:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్‌ ప్యాకెట్‌పైనే రాసి ఉంటుంది. కానీ, ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోరు. కొన్ని ప్రాంతాల్లో నిషేధం విధించినా సిగరెట్ల వాడకం పెరుగుతుందే గానీ.. తగ్గట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 6.5 ట్రిలియన్‌ సిగరెట్ల విక్రయాలు జరుగుతున్నాయట. రోజుకు వందల కోట్ల సిగరెట్లు తాగుతున్నారని ఓ అంచనా. సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్‌ వంటివి వస్తాయని అందరికి తెలిసిందే. కానీ, సిగరెట్‌ చివర్లో ఉండే పీక గురించి ఎప్పుడైనా ఆలోచించారా?ఎక్కడపడితే అక్కడ సిగరెట్లు తాగి చివర్లో ఉండే ఫిల్టర్‌ పీకలను పారేస్తుంటారు. ఈ సిగరెట్ల కన్నా.. సిగరెట్‌ పీకలు పర్యావరణానికి ఎంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే ఈ ప్రమాదకర సిగరెట్‌ పీకలను ఓ స్టార్టప్‌ సంస్థ పునర్వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది! 

నొయిడాకు చెందిన గ్రాడ్యుయేట్‌ నామన్‌ గుప్తా, విశాల్‌ కనెత్‌ అనే ఇంజినీర్‌ కలిసి కొన్నాళ్ల కిందట ‘కోడ్‌ ఎఫర్ట్‌’ పేరుతో స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా సిగరెట్‌ పీకలను శుభ్రపర్చి బొమ్మలు, కుషన్లు తయారు చేస్తున్నారు. సాధారణంగా సిగరెట్‌ చివర్లో ఉండే పీకలను సెల్యూలోజ్‌ ఎసిటేట్‌ అనే సహజ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ఇవి భూమిలో కలిసిపోవడానికి పదేళ్లకుపైగా సమయం పడుతుంది. దీన్ని బట్టి ఆలోచించండి.. రోజుకు కోట్ల సిగరెట్‌ పీకలు భూమిలో కలిసిపోకుండా.. ఎంత భారీ భూకాలుష్యానికి కారణమవుతున్నాయో! ఈ ఆలోచనే ‘కోడ్‌ ఎఫర్ట్‌’ స్టార్టప్‌ కంపెనీ స్థాపనకు శ్రీకారం చుట్టింది. 

వీబిన్స్‌తో సిగరెట్‌ పీకల సేకరణ

సిగరెట్ల వినియోగం, చెత్తబుట్టలకు చేరుతున్న సిగరెట్‌ పీకలు వంటి అంశాలపై నామన్‌.. విశాల్‌ బాగా అధ్యయనం చేశారు. అనంతరం ‘కోడ్‌’ కంపెనీ స్థాపించి.. యంత్రాలను సమకూర్చుకున్నారు. అయితే, సిగరెట్‌ పీకలను ఎలా సేకరించాలనేదే పెద్ద సవాల్‌. ఇందుకోసం కోడ్‌ సంస్థ వీధి వ్యాపారులు, చెత్త సేకరించేవాళ్లకు ‘వీబిన్స్‌’ పేరుతో డబ్బాలు పంపిణీ చేసింది. రోడ్ల పక్క దుకాణాలు, టీ స్టాల్స్‌, కార్యాలయాల్లోని చెత్తబుట్టల వద్ద వీటిని పెట్టి కేవలం సిగరెట్‌ పీకలను సేకరించాలని సూచించింది. ఇలా సేకరించిన సిగరెట్‌ పీకలను ఈ సంస్థే కిలో రూ.250 చొప్పున కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత వాటిని శుభ్రం చేయగా వచ్చిన దూదితో బొమ్మలు, కుషన్లు తయారు చేస్తోంది.

పర్యావరణ పరిరక్షణకే..!

నామన్‌.. విశాల్‌ వ్యాపారమే చేయాలి అనుకుంటే.. సాధారణ బొమ్మలు తయారు చేసి అమ్మగలరు. కానీ, తమ వంతుగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే తపనతోనే ఈ మిత్రులు ఈ స్టార్టప్‌ను ప్రారంభించడం అభినందించాల్సిన విషయం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో సిగరెట్‌ పీకలను సేకరిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు చెబుతున్నారు. నిజంగానే ఇది మంచి ఆలోచన కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని