Suneetha Narreddy: ఆ దృశ్యాలు చూస్తే గుండెపోటు అనుకుంటారా?: వివేకా కుమార్తె సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) (CBI) చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) అన్నారు.

Updated : 15 Apr 2024 14:11 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) (CBI) చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) అన్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ కేసులో సీబీఐపై ఒత్తిడి ఉందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకా హత్యకు సంబంధించిన పలు వివరాలతో ఆమె పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటు అని ఎవరైనా అనుకుంటారా? అని ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి.. ఆ తర్వాత రోజు ఉదయం కాల్‌ డేటాతో పాటు గూగుల్‌ టేకౌట్‌, ఐపీడీఆర్‌ డేటాను సునీత వెల్లడించారు. 

అవినాష్‌ అసూయ పడ్డారు..

‘‘మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురు నిందితుల పేర్లు చెప్పింది. దీనిలో ఏ1గా ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌ (ఏ2), ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దస్తగిరి (ఏ4) ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డితో ఎంపీ అవినాష్‌రెడ్డికి పరిచయం ఉంది. ఆయనతో సునీల్‌ యాదవ్‌ తమ్ముడు కిరణ్‌యాదవ్‌ దిగిన ఫొటోలు ఉన్నాయి. వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయి. అవినాష్‌ మాత్రం వీళ్లెవరో తెలియదని అంటున్నారు. ఫొటోలు, ఫోన్‌ డేటా చూస్తే అతడితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి బలమైన నాయకుడు. ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్‌ అసూయ పడ్డారు. ఆయన తండ్రి, మరో నిందితుడు భాస్కర్‌రెడ్డి ఫోన్‌ డేటా పరిశీలిస్తే మార్చి 14 నుంచి 16 ఉదయం వరకు స్విచ్ఛాఫ్‌ ఉంది. హత్య జరుగుతున్న సమయంలో అవినాష్- ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి’’ అని సునీత అన్నారు.

షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఇలా అనలేదే?

ఇటీవల వివేకా సోదరి విమలారెడ్డి చేసిన విమర్శలపై సునీత స్పందించారు. ‘‘చనిపోయింది విమలమ్మ అన్న. ఆయనపై ఆమె చూపిన ప్రేమ ఇదేనా? ఆడపిల్లలు ఇలా బయటకొచ్చి మాట్లాడుతున్నారంటున్నారు. మా నాన్నకి కుమార్తెనైనా.. కుమారుడినైనా నేనే. షర్మిలపైనా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. గతంలో ఆమె 3200 కి.మీ పాదయాత్ర చేసినప్పుడు ఇలా అనలేదే? ఇప్పుడు మాత్రం విమర్శలా? న్యాయం కోసం సీఎం జగన్‌ సహా ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధం. గతంలో కొన్నిసార్లు ఆయనతో మాట్లాడాను. ఆ తర్వాత అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీనికోసం లేఖలు కూడా రాశా. ’’ అని సునీత అన్నారు. 

హత్యకు కొద్దిరోజుల ముందు ఓ సభలో వేదికపై అవినాష్‌ ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా వివేకా వెళ్లిపోతున్న దృశ్యాలను సునీత ప్రదర్శించారు. వివేకా ఇంటి సమీపంలో ఉమాశంకర్‌రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత సాక్షి మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైకాపా నేతల వ్యాఖ్యలను పీపీటీలో ఆమె ప్రస్తావించారు. ఐదేళ్ల క్రితం తనది ఒంటరి పోరాటమని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ప్రజలకు నిజం తెలిసేందుకే వీటిని ప్రదర్శించినట్లు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని