Sunitha: జగన్‌.. బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్‌ అవుతుంది: సునీత

సీఎం జగన్‌కు బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్‌ అవుతుందని వైఎస్‌ సునీత అన్నారు.

Updated : 25 Apr 2024 19:13 IST

పులివెందుల: సీఎం జగన్‌కు బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్‌ అవుతుందని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత అన్నారు. వైద్యులు సరైన సలహా ఇవ్వలేదన్న ఆమె.. జగన్‌ త్వరగా బ్యాండేజ్‌ తీయాలని ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నట్టు చెప్పారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందన్నారు.

నామినేషన్‌ సందర్భంగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సునీత స్పందించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘ ఇవాళ జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోంది. ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత ద్వేషం. మీ కోసం త్యాగం చేశారు కాబట్టే.. వివేకాపై కోపమా? సీఎం జగన్‌కు న్యాయవ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదు. ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలి. హత్యపై మాట్లాడవద్దంటూ కోర్టు ఆర్డర్‌ తెచ్చిన వాళ్లే మాట్లాడుతున్నారు. సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయవద్దు. తప్పు చేసి ఉంటే నాకైనా, నా భర్తకైనా శిక్ష పడాల్సిందే. అవినాష్‌రెడ్డి చిన్న పిల్లోడని చెబుతున్నారు.. ఎంపీ పదవులు పిల్లలకు ఇస్తారా? సీబీఐ నిందితులు అన్న వాళ్లను జగన్‌ ప్రోత్సహిస్తున్నారు. ఐదేళ్లుగా నా తండ్రి హత్యపై పోరాడుతుంటే రాజకీయాలు అంటగడుతున్నారు. సీఎంను ప్రాధేయపడుతున్నా.. ఇప్పటికైనా నా పోరాటానికి సహాయం చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని