IRCTC Rampath Yatra: ‘రామ్‌పథ్’ రైలులో కాశీ, అయోధ్య చుట్టొద్దామా..?

ఈ శీతాకాలంలో హాలిడే ప్లాన్‌ చేస్తున్నారా? అయోధ్య, వారణాసి, ప్రయోగరాజ్‌ వంటి పుణ్యక్షేత్రాల్ని చుట్టిరావాలనుకొంటున్నారా? అయితే, ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది......

Published : 06 Dec 2021 23:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ శీతాకాలంలో హాలిడే ప్లాన్‌ చేస్తున్నారా? అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ వంటి పుణ్యక్షేత్రాల్ని చుట్టిరావాలనుకొంటున్నారా? అయితే, ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. శ్రీ రామ్‌పథ్‌ యాత్ర పేరిట స్పెషల్‌ టూరిస్టు రైలును సిద్ధం చేసింది. ఈ నెల 25న గుజరాత్‌లోని సబర్మతి జంక్షన్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు దేశంలోని పలు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు కలిగిన నగరాల మీదుగా సాగనుంది. ఈ ప్యాకేజీపై ఐఆర్‌సీటీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 25న ఉదయం 6.05 గంటలకు గుజరాత్‌లోని సబర్మతి జంక్షన్‌ రైల్వే స్టేషన్‌లో బయలుదేరే ఈ రైలు మధ్యప్రదేశ్‌ను కలుపుతూ అయోధ్యకు చేరుకోనుంది. మరుసటి రోజుకు రత్లాం, ఉజ్జయినికి చేరుకోనుంది.

రూట్‌ ఇదే: అయోధ్య, వారణాసి, నందిగ్రామ్‌, ప్రయాగ్‌రాజ్‌, చిత్రకూట్‌ ప్రాంతాలకు భక్తుల్ని తీసుకెళ్తుంది. వీటి మధ్య సబర్మతి జంక్షన్‌, ఛాయాపురి, ఆనంద్‌, గోద్రా, రత్లాం, దహోడ్‌, నగ్ద, మక్సి, ఉజ్జయిని, సుజల్‌పుర్‌, ఎస్‌ హర్‌దరమ్‌నగర్‌, సెహోర్‌, విదిశ, బినా, గంజ్‌ బసోడా, ఝాన్సీ స్టేషన్లలో ఆగుతుంది. ఏడు రాత్రులు/ఎనిమిది రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర.. డిసెంబర్‌ 25న ప్రారంభమై 2022 జనవరి 1తో ముగుస్తుంది. ఈ యాత్రకు వెళ్లాలనే ఆసక్తి కలిగిన పర్యాటకులకు టికెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. లేదంటే ఐఆర్‌సీటీసీ టూరిస్ట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రం లేదా రీజినల్‌ కార్యాలయాల్లోనూ పొందొచ్చు. 

టికెట్‌ ధర ఎంత?: మొత్తం 640 సీట్లు కలిగిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలులో ప్రయాణానికి రెండు వేర్వేరు ధరలను ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. స్లీపర్‌ తరగతిలో టికెట్‌ ధర ₹7,560 కాగా.. థర్డ్‌ ఏసీ కేటగిరీలో ప్రయాణానికి ధరను ₹12,600గా నిర్ణయించారు. ఈ రైలులో 320 సీట్లు ఏసీ కాగా.. మిగతా 320 సీట్లు స్లీపర్‌ క్లాస్‌. రామ్‌పథ్ రైలులో ప్రయాణికులకు ఉదయం టీ/కాఫీ, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించనున్నారు. ఆయా యాత్రా స్థలాల్లో ప్రవేశ రుసుం, లాండ్రీ, ఔషధాలు, టూర్‌గైడ్‌ తదితర సర్వీసులు మాత్రం ఈ ప్యాకేజీ పరిధిలోకి రావు. వీటికి అదనంగా చెల్లించుకోవాల్సిందే..!

ఈ ఏడాదిలో ఇది మూడో రామ్‌పథ్‌ యాత్ర రైలు కావడం విశేషం. ఫిబ్రవరిలో ఇండోర్‌ నుంచి అయోధ్యకు.. రెండోది ఇటీవల పుణె నుంచి అయోధ్యకు నడిపారు. వీటికి పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో మరోసారి నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

క్యాన్సిలేషన్‌ పాలసీ: పర్యటన క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం.. బుకింగ్‌ చేసుకున్న రైలు టికెట్‌ను 15 రోజుల ముందు రద్దు చేసుకుంటే ₹250లు క్యాన్సిలేషన్‌ ఛార్జి అవుతుంది. అదే 8 నుంచి 14 రోజుల్లోపైతే టికెట్‌ మొత్తం ధరలో 25%, 4 నుంచి 7 రోజుల్లోపు అయితే 50%, నాలుగు రోజుల కన్నా తక్కువ అయితే 100% కోల్పోవాల్సి వస్తుంది.

Read latest General News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని