Revanth Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌పై వాళ్లిద్దరూ సీబీఐ విచారణ కోరరా?: సీఎం రేవంత్‌రెడ్డి

అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలనే భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఫోన్‌ ట్యాపింగ్‌పై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 28 May 2024 19:14 IST

హైదరాబాద్‌: అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలనే భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఫోన్‌ ట్యాపింగ్‌పై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన దిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘‘అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయం అయ్యాయి. ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ట్యాపింగ్‌ అంశం బయటకు వచ్చింది. హార్డ్‌డిస్క్‌లు, డేటా బ్యాకప్‌ ఎక్కుడుందో అధికారులే తేల్చాలి. డేటా ఉందో, లేదో.. ఎలా మాయం చేశారో అంతా విచారణలో తేలుతుంది. మా ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయదు. రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావులేదు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు. అవి గుర్తుకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం ఉంటుంది. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి అప్పగించాం.

ఎన్నికల కోడ్‌ ముగిశాక వాటి గురించి వివరిస్తా

కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలపై నిపుణుల సలహాతో ముందుకెళ్తాం. ప్రస్తుతం అక్కడ నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదు. 52 టీఎంసీల నీళ్లు సముద్రంపాలయ్యాయి. వాటి విద్యుత్‌ బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేవు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత విద్యుత్‌కు సంబంధించిన అన్ని విషయాలు వివరిస్తా’’అని సీఎం రేవంత్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని