Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2023 13:05 IST

1. గుంటూరు వాహిని పొడిగించాలని రైతుల రాస్తారోకో.. వాహనాల రాకపోకలకు అంతరాయం

గుంటూరు ఛానెల్‌ పొడిగించాలంటూ గుంటూరు జిల్లా పెదనందిపాడు వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. కాల్వ పొడిగింపు పనులకు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనలతో గుంటూరు-పరుచూరు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకుండా మహిళా రైతులంతా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రియురాలికి రూ.900కోట్ల ఆస్తి రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని

ఇటలీ (Italy)ని సుదీర్ఘకాలం పాలించి తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోని (Silvio Berlusconi) ఇటీవల కన్నుమూశారు. అయితే వేల కోట్లకు అధిపతి అయిన సిల్వియో ఆస్తి పంపకాలకు సంబంధించిన వీలునామా (Will)ను ఇటీవల మీడియా సమక్షంలో వారసులకు చదివి వినిపించారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సిల్వియో తన 33 ఏళ్ల ప్రేయసి కోసం ఏకంగా రూ.900కోట్లను రాసిచ్చారట..! ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మీకు నచ్చిన జియో నంబర్ కావాలా.. ఇలా ఎంచుకోండి

కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలంటే టెలికాం ఆపరేటర్‌ వద్ద ఉన్న వాటిలో ఏదో ఒక నంబర్‌ను ఎంచుకోవాలి. ఆ నంబర్‌ నచ్చకపోయినా అలాగే వినియోగించాలి. కానీ, చాలా మంది తమకు ఇష్టమైన అంకెలు, పుట్టిన తేదీ, లక్కీ నంబర్లు ఇలా.. ఈ అంకెలు ఫోన్‌ నంబర్‌లో ఉండాలనుకుంటారు. కానీ అది వీలు పడదు. దీని కోసం జియో (Reliance Jio) కొత్త స్కీమ్‌ తీసుకొచ్చింది. తమకు నచ్చిన అంకెలతో ఫోన్‌ నంబర్‌ ఎంచుకొనే వెసులుబాటు జియో యూజర్లకు అందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జిమ్‌కి వెళ్లి వచ్చాక గుండె పోటు.. యువకుడి హఠాన్మరణం

జిమ్‌కి వెళ్లి వచ్చాక గుండెపోటుతో శ్రీధర్‌ (31) అనే యువకుడు హఠాత్తుగా మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. బాలపేటకకు చెందిన శ్రీధర్‌ వ్యాయామం చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఆయన గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆధారాలతో చూపిస్తా.. మీ చిన్నాన్నను కొట్టుపో: కేతిరెడ్డికి జేసీ సవాల్‌

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ‘మీ కుటుంబం ఎలా బతికిందో నేను చెబుతాను.. చెప్పుతో కొడుదువురా’ అంటూ సవాల్‌ విసిరారు. గత శనివారం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డిల(Kethireddy Pedda Reddy)పై జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆరోపణలు చేయడంపై .. చెప్పుతో కొడతామంటూ వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకార్‌ రెడ్డి మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దిల్లీ వేదికగా.. భగ్గుమన్న అమెరికా-చైనా విభేదాలు..

అమెరికా(USA)-చైనా (China)మధ్య విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. ఈ సారి వీరి గొడవకు దిల్లీ (Delhi) కేంద్రంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో మానవహక్కుల విభాగం ఉన్నతాధికారి ఉజ్రా జియా.. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామాతో భేటీ అయ్యారు. వీరి భేటీకి దిల్లీ వేదికైంది. దీంతో అమెరికా తీరుపై చైన్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నది ఉద్ధృతిలో.. అర్ధరాత్రి NDRF డేరింగ్ ఆపరేషన్‌

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) అతలాకుతలమైంది. రాష్ట్రంలో ప్రధానమైన బియాస్‌ నది (Beas River) ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి సాహసోపేతమైన ఆపరేషన్‌ చేపట్టి బియాస్‌ నదిలో చిక్కుకున్న ఆరుగురిని ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బంది కాపాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మిత్ర దేశాలను బుజ్జగించేందుకు.. బ్రిటన్‌ చేరిన జోబైడెన్‌..!

అమెరికా(USA) అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden) ఆదివారం రాత్రి బ్రిటన్‌కు చేరుకొన్నారు. సోమవారం ప్రధాని రిషి సునాక్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబుల సరఫరాపై ఆయన చర్చించే అవకాశం ఉంది. బ్రిటన్‌, కెనడా దేశాలు ఈ బాంబుల సరఫరాపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్‌ ఆయుధ నిల్వలు పడిపోతుండటంతో ఈ రకం బాంబుల సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొందని అమెరికా చెబుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మీ వెంటే ఉంటా భయపడొద్దు.. రంగంలో స్వర్ణలత

ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.. మీ వెంటా ఉంటానని చెప్పారు. ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అంగన్‌వాడీ కార్యకర్తల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు 36 గంటల దీక్షకు దిగారు. ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan)పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించిన దీక్షకు అంగన్‌వాడీ కార్మికులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని