TSRTC: సంక్రాంతి నాటికి 200 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్‌

తెలంగాణలో సంక్రాంతి పండుగ నాటికి 200 కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు.

Updated : 22 Dec 2023 22:35 IST

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ నాటికి 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వినియోగంలోకి తీసుకొస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

రద్దీ పెరిగింది.. వీలైనంత త్వరగా కొత్త బస్సులు

హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను సజ్జనార్‌ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్‌ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 

నాలుగైదు నెలల్లో 2వేలకు పైగా కొత్త బస్సులు

“ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా  కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తాం. అందులో 400 ఎక్స్‌ప్రెస్‌లు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే..  హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి తీసుకొస్తాం. వీటిన్నంటినీ వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం. ఈ కొత్త బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాం. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశాం. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ఉంది’’ అని సజ్జనార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు