TSRTC: ఆ కార్డు చెల్లదు.. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి చేశారు.

Updated : 08 Jan 2024 18:15 IST

హైదరాబాద్‌: ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) కీలక విజ్ఞప్తి చేసింది. ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరని స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని.. అలా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ అసలైన గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని TSRTC ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. అయితే,  పాన్‌ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టంచేశారు. 

ఒరిజినల్‌ కార్డు లేకపోతే.. టికెట్‌కు డబ్బు చెల్లించాల్సిందే!

‘‘ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్‌ ఫోన్లలో,  ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్‌లు చూపిస్తున్నారని TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ అసలైన గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ తీసుకోవాలని కోరుతున్నాం. అసలైన గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సిందే. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీ చెల్లించి టికెట్‌ తీసుకొని ప్రయాణించాలి. 

జీరో టికెట్‌ తీసుకోకపోతే..

‘‘ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం?’ అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును TSRTCకి రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్‌ చేస్తుంది. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే..  సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. అందువల్ల ప్రతి మహిళా జీరో టికెట్‌ తీసుకోవాల్సిందే. ఒకవేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది’’ అని సజ్జనార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు