Sri Rama Navami: ₹151 చెల్లిస్తే.. మీ ఇంటికే రాములోరి కల్యాణ తలంబ్రాలు

శ్రీరామ నవమి వేడుకల వేళ సీతారామ చంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 01 Apr 2024 17:20 IST

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది కూడా భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు.

భద్రాచలంలో ఏప్రిల్‌ 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. టీఎస్‌ఆర్టీసీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎంతో నిష్ఠతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నోఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గతేడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను అందించాం’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని