చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్‌?: సీఎంకు వివేకా సతీమణి లేఖ

సీఎం జగన్‌ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు.

Updated : 25 Apr 2024 11:39 IST

కడప: సీఎం జగన్‌ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు.   

‘‘2009లో మీ తండ్రిని కోల్పోయినపుడు ఎంత మనోవేదన అనుభవించావో.. 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారణం కావడం..  వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం ఎంతో బాధించింది. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా, పార్టీ వర్గాలు  తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా?

న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారు. కొంతమంది దాడులకూ తెగబడేస్థాయికి దిగజారుతున్నా నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలనూ టార్గెట్‌ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి?కుటుంబసభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం. ఇది సమంజసమా? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్‌ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని వేడుకుంటున్నా’’ అని సౌభాగ్యమ్మ తన లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని