Rajya Sabha: లోక్‌సభ ఎన్నికల్లో విజయం.. రాజ్యసభలో 10 స్థానాలు ఖాళీ

సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించడంతో.. ఆ సభలో 10 స్థానాలు ఖాళీ అయ్యాయి.

Published : 11 Jun 2024 18:29 IST

దిల్లీ: ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) పలువురు రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించడంతో.. ఆ సభలో 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజ్యసభ సెక్రటేరియట్‌ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది. 18వ లోక్‌సభకు ఎన్నికైన నేపథ్యంలో జూన్‌ 4 నుంచి వారి రాజ్యసభ (Rajya Sabha) సభ్యత్వం నిలిచిపోయినట్లు తెలిపింది. అస్సాం, బిహార్‌, మహారాష్ట్రల నుంచి రెండు చొప్పున, హరియాణా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

కామాఖ్య ప్రసాద్‌ తాసా, సర్బానంద సోనోవాల్‌ (అస్సాం), మీసా భారతి, వివేక్‌ కుమార్‌ (బిహార్‌), ఉదయన్‌రాజే భోంస్లే, పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), దీపేందర్‌ సింగ్‌ హుడా (హరియాణా), కేసీ వేణుగోపాల్‌ (రాజస్థాన్‌), బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ (త్రిపుర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌)లు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి గెలుపొందారు. రాజ్యసభ సెక్రటేరియట్‌ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది.

కీలక శాఖలు భాజపాకే.. 12 మందికి యథాతథం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు 71 మంత్రులతో కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సోమవారం శాఖల కేటాయింపు జరిగింది. రాజ్యసభ ఎంపీగా ఉంటూ పోటీ చేసి గెలిచిన పీయూష్‌ గోయల్‌కు వాణిజ్యం, పరిశ్రమలు, సర్బానంద సోనోవాల్‌కు నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా, జ్యోతిరాదిత్య సింధియాకు కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, టెలికాం శాఖలు దక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని