Puri: పూరీలో అపశ్రుతి.. బాణసంచా పేలి ముగ్గురి మృతి

ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ జరిగిన బాణసంచా పేలుడులో ఒకరు మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 30 May 2024 10:55 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ జరిగిన బాణసంచా పేలుడులో ముగ్గురు మృతిచెందారు. మరికొంతమంది భక్తులకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు పటాసులు పేల్చారు. ఆ నిప్పురవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన చోట పడ్డాయి. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించి దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ముగ్గురు ప్రాణాలు విడిచారు. మృతుల్లో 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

ప్రాణాలు కాపాడుకునేందుకు కొంతమంది పుష్కరిణిలోకి దూకినట్లు అనుమానిస్తున్నారు. గురువారం ఉదయం అండర్‌ వాటర్‌ సెర్చింగ్‌ కెమెరాలతో గాలింపు చేపట్టారు. క్షతగాత్రులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అందుకయ్యే ఖర్చును సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి భరించనున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని