Uttarakhand Tunnel: ఆపరేషన్‌ టన్నెల్‌.. క్షేమంగా బయటపడిన 41 మంది కూలీలు

ఉత్తర్‌కాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు.

Updated : 28 Nov 2023 21:13 IST

ఉత్తర్‌కాశీ: విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన సహాయక బృందాలు అనుకున్నది సాధించాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ సొరంగం పాక్షికంగా కుప్పకూలడంతో అందులో చిక్కుకు పోయిన 41 మంది కూలీలంతా బయటకు వచ్చారు. వారు చిక్కుకున్న ప్రాంతం వరకు డ్రిల్లింగ్‌ చేపట్టిన అధికారులు.. అందులోకి గొట్టాన్ని పంపించి దాని ద్వారా కూలీలు ఒక్కొక్కర్నీ బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో వారిని ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా సురక్షితంగా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కూలీలను టన్నెల్‌ నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

నవంబరు 12న సొరంగం పనులు చేస్తుండగా అనూహ్యంగా చోటు చేసుకున్న ఘటనతో వారంతా సొరంగంలో చిక్కుకుపోయారు. తిరుగాడడానికి రెండు కి.మీ. మేర ప్రాంతం ఉండడం, బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునే వెసులుబాటును కల్పించడంతో వారు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి సహాయక సిబ్బంది వారి ప్రాణాలను కాపాడగలిగారు. 

సొరంగ శిథిలాల్లో 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని వేయగలిగితే కూలీల వద్దకు చేరుకోవచ్చని గుర్తించిన అధికారులు.. అందుకోసం ఆగర్‌ యంత్రంతో డ్రిల్లింగ్‌ చేపట్టారు. ఈ మిషన్‌ 47 మీటర్లు తవ్విన తర్వాత.. ప్రమాదవశాత్తూ సొరంగంలోని ఇనుపపట్టీని ఢీకొట్టింది. దీంతో దీని బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పనిచేయకుండా పోయింది. అయినా అధికారులు వెనకడుగు వేయలేదు. ప్రత్యామ్నాయంగా కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ పనులు చేపట్టారు. అదే సమయంలో సొరంగంలో చిక్కుకున్న ఆగర్‌ మిషన్‌ శిథిలాలను కట్టర్‌ సాయంతో తొలగించారు.

ఆ తర్వాత 12 మంది ‘ర్యాట్‌ హోల్‌ మైనర్ల’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు)ను రంగంలోకి దించారు. మిగతా డ్రిల్లింగ్‌ పనిని వీరు మాన్యువల్‌గా చేపట్టారు. సోమవారం రాత్రి నుంచి ఈ ర్యాట్‌ హోల్‌ మైనర్లు మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టడంతో 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని