Amit Shah: దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్‌ షా

పశ్చిమ్‌ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు.

Published : 23 Apr 2024 17:29 IST

కోల్‌కతా: కాంగ్రెస్‌కు కానీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)లో జోక్యం చేసుకునే ధైర్యం లేదని భాజపా అగ్ర నాయకుడు అమిత్‌ షా (Amit shah) అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే.. మీకు వచ్చిన సమస్య ఏంటని అడుగుతున్నాను. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే, సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మోదీ మళ్లీ ప్రధానిగా రావాలి. గత ఎన్నికల్లో 18 సీట్లు ఇచ్చారు.. ప్రతిగా మోదీ రామమందిరం తీసుకువచ్చారు. ఈసారి 35 సీట్లు ఇస్తే.. చొరబాట్లను ఆపేస్తారు. తన ఓటు బ్యాంక్‌పై దృష్టిపెట్టిన మమతాబెనర్జీ.. సందేశ్‌ఖాలీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదు. కానీ హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడు. భాజపాకు ఓటు వేయండి. అప్పుడు దీదీ గుండాలు తలకిందులుగా వేలాడతారు’’  అని అమిత్‌ షా అన్నారు. ఈసారి తమ లక్ష్యం 35 లోక్‌సభ స్థానాలు సాధించడమని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. కానీ టీఎంసీ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘10 సంవత్సరాల క్రితం టీఎంసీ నేతలు చిన్నపాటి ఇళ్లల్లో ఉండేవారు. సైకిల్‌ మీద తిరిగేవారు. కానీ ఇప్పుడు నాలుగు అంతస్తుల భవనాల్లో నివసిస్తూ.. కార్లలో చక్కర్లు కొడుతున్నారు. అందంతా ప్రజల సొమ్మే’’ అంటూ విమర్శలు చేశారు.

సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల్లో ప్రకటన వస్తుందనగా మార్చి నెలలో మోదీ సర్కార్‌ సీఏఏ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా దానిని జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఏఏ చట్టం-2019లోనే  పార్లమెంటు ఆమోదం పొందినా.. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా.. విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా చట్టం అమలులో జాప్యం చోటుచేసుకుంది. ఇదిలాఉంటే.. విపక్ష కూటమి ‘ఇండియా’ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. సీఏఏను రద్దు చేస్తామని మమత ఇదివరకే హామీ ఇచ్చారు. తమ పార్టీ అన్ని మతాలను ప్రేమిస్తుందని, మత ప్రాతిపదికన విభజనను మాత్రం తాము కోరుకోవడం లేదన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు