Uttar Pradesh: యూపీలో ‘సాక్షి హత్య’ కేసు ప్రకంపనలు.. మరో నిందితుడి ఎన్‌కౌంటర్‌

ఉత్తరప్రదేశ్‌ (UP)లో ఉమేశ్‌ పాల్ హత్య కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఉమేశ్‌పై తొలుత కాల్పులు జరిపిన నిందితుడిని హతమార్చారు.

Updated : 06 Mar 2023 10:17 IST

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో సంచలనం రేపిన ఉమేశ్‌ పాల్‌ (Umesh Pal) హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారా పోలీసు స్టేషన్‌లో నిందితుడు విజయ్‌ అలియాస్‌ ఉస్మాన్‌ను ఎన్‌కౌంటర్‌ (Encounter)లో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమేశ్‌ పాల్‌పై కాల్పులు జరిపిన ఆరుగురు షార్ప్‌ షూటర్లలో ఉస్మాన్‌ ఒకడు. ఇతడే నేరుగా ఉమేశ్‌ను కాల్చాడని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ కేసులో మరో నిందితుడు అర్బాజ్‌ను ఫిబ్రవరి 27న పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. అతడు పారిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకొంది. 

2005 నాటి బీఎస్పీ (BSP) శాసనసభ్యుడు రాజుపాల్‌ (Raju Pal) హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ను గత వారం అతడి అంగరక్షకులతోపాటు నడిరోడ్డుపై కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన యూపీ సహా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఉమేశ్‌ పాల్‌ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉమేశ్ భార్య జయ పాల్‌ ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్‌, భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిపై కేసులు నమోదు చేశారు.

2004లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాజు పాల్‌ అలహాబాద్‌ (పశ్చిమ) స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అతీక్‌ అహ్మద్‌ తమ్ముడు ఖలీద్‌ అజిమ్‌పై విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే రాజు పాల్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ ప్రస్తుతం గుజరాత్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రాజుపాల్‌ హత్య కేసులో ఉమేశ్ పాల్‌ ప్రధాన సాక్షిగా ఉన్నారు. అయితే గతంలో ఉమేశ్‌ పాల్‌ను అతీక్‌ అహ్మద్ అనుచరులు ఓసారి కిడ్నాప్‌ చేశారు. ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఇటీవల ఉమేశ్‌ను అతడి ఇంటి వద్దే దారుణంగా హత్య చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ (UP) ప్రభుత్వం.. ఇటీవల అతీక్‌ అనుచరుడి ఇంటిని కూల్చేశారు. ఉమేశ్ పాల్‌ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితులపై రివార్డు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని