NEET Row: ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్‌ సవాల్‌

Eenadu icon
By National News Team Published : 05 Jul 2024 19:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్నా: నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం (NEET Row)లో తనపై నిందలు వేసేందుకు నీతీశ్‌ (Nitish kumar) సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) అన్నారు. నీట్‌ అంశంపై తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.  ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..  ‘నీతీశ్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో ఒక ఇంజిన్‌ అవినీతిని, మరో ఇంజిన్‌ నేరాలను ప్రమోట్‌ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పేపర్‌ లీకైనా, వంతెనలు కూలినా, హత్యలు జరిగినా.. రాష్ట్రంలో ప్రతి సమస్య తేజస్వీ వల్లేనంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వద్ద ఆధారం ఉంటే ఆరోపణలు మాని అరెస్టు చేసుకోవచ్చన్నారు. 

నీట్‌ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్‌

నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో జరిగిన అవకతవకలు, పేపర్‌ లీక్‌ వెనక తేజస్వీ యాదవ్ సహాయకుడి ప్రమేయం ఉందంటూ బిహార్‌ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ ఇటీవల ఆరోపించడంపై ఆర్జేడీ కౌంటర్‌ ఇచ్చింది. బిహార్‌లోని సీనియర్‌ మంత్రులతో ఇతర కీలక అనుమానితులు ఉన్న ఫొటోలను విడుదల చేసింది. పట్నా పోలీసులు గత నెలలో పలువురిని అరెస్టు చేయడంతో వెలుగులోకి వచ్చిన ప్రశ్నపత్రం లీకేజీ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని