Bird Flu: బర్డ్‌ ఫ్లూ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌

బర్డ్‌ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని, పౌల్ట్రీల్లో అసాధారణ మరణాలు సంభవిస్తే ఆ విషయాన్ని వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Published : 31 May 2024 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పౌల్ట్రీలు, ఇతర పక్షులకు సంబంధించి అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని, ఆ విషయాన్ని వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ (నెల్లూరు), మహారాష్ట్ర (నాగ్‌పుర్‌), కేరళ (అలప్పుజ, కొట్టాయం), ఝార్ఖండ్‌ (రాంచీ)లలో దీని వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపింది.

‘‘అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా మానవులకూ సోకే ఆస్కారం ఉంది. ఈ వ్యాధి సంక్రమణను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరం’’ అని పేర్కొంటూ మే 25న ఎన్‌సీడీసీ, కేంద్ర పశుసంవర్ధక శాఖలు కలిసి సంయుక్తంగా జారీ చేసిన ప్రకటనలో వెల్లడించాయి. యాంటీవైరల్‌ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించాయి. ఇప్పటికే బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి క్రియాశీలంగా ఉన్న రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని.. ఇన్‌ఫెక్షన్‌ సోకిన పక్షులను వధించే వారితోపాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకొని హెచ్‌5ఎన్‌1 పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

మానవులకూ బర్డ్‌ఫ్లూ ముప్పు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

బర్డ్‌ ఫ్లూను ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఇది పక్షులు, కోళ్లలో వస్తుంది. ఇన్‌ఫ్లూయంజా టైప్‌-ఏలో డజనుకుపైగా వైరస్‌లు ఉండగా హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన బర్డ్‌ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ హెచ్5ఎన్1 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తొలిసారిగా 1997లో గుర్తించింది. భారత్‌లో మాత్రం 2006లో ఈ వైరస్‌ బయటపడింది. మన దేశంలో ఉండే అనువైన వాతారణం దృష్ట్యా ఏటా వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుంది. కొన్ని నిర్వహణ పద్ధతుల వల్ల ఇతర పక్షులకు, జంతువులతో పాటు మానవులకు వైరస్‌ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు