Ayodhya: 60 లక్షల మంది దర్శనం.. రూ.25 కోట్ల విరాళాలు!

అయోధ్య రామ మందిరానికి నెల రోజుల వ్యవధిలో రూ.25 కోట్ల మేర విరాళాలు అందినట్లు ఆలయ ట్రస్టు సభ్యులు వెల్లడించారు.

Published : 24 Feb 2024 21:39 IST

లఖ్‌నవూ: అయోధ్య రామమందిరానికి (Ayodhya Ram Temple) నెల రోజుల వ్యవధిలో రూ.25 కోట్ల మేర విరాళాలు అందినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఇందులో 25 కిలోల బంగారు, వెండి ఆభరణాలూ ఉన్నట్లు తెలిపింది. జనవరి 23 నుంచి దాదాపు 60 లక్షల మంది భక్తులు బాల రాముడి (Balak Ram)ని దర్శించుకున్నట్లు ట్రస్టు ప్రతినిధి ప్రకాశ్‌ గుప్తా శనివారం చెప్పారు. విరాళాల విషయంలో.. ట్రస్టు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఆన్‌లైన్ లావాదేవీల లెక్కలు తేలాల్సి ఉందన్నారు. గత నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా బాల రాముడి ప్రాణప్రతిష్ఠను వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

‘‘ఆలయంలో వినియోగించలేని వెండి, బంగారపు వస్తువులను భక్తులు కానుకగా ఇస్తున్నారు. అయితే, బాల రాముడిపై వారి భక్తిని దృష్టిలో ఉంచుకుని స్వీకరిస్తున్నాం. రామ నవమి రోజుల్లో విరాళాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. సుమారు 50 లక్షల మంది దర్శనానికి విచ్చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. ఆ సమయంలో విరాళాల స్వీకరణకు ఇబ్బందులు తలెత్తకుండా ‘ఎస్బీఐ’ సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం. రసీదుల జారీకి 10కి పైగా కంప్యూటర్‌ కౌంటర్లు, అదనపు హుండీలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో కూడిన విరాళాల లెక్కింపు గదిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ప్రకాశ్‌ గుప్తా తెలిపారు.

బాలరాముడి దర్శనం.. రోజూ గంట విరామం: ట్రస్ట్‌ కీలక నిర్ణయం

భక్తులు కానుకగా ఇచ్చే బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువుల మదింపు, వాటిని కరిగించడం, నిర్వహణను భారత ప్రభుత్వ టంకశాలకు అప్పగించినట్లు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. అదేవిధంగా.. విరాళాలు, చెక్కులు, డ్రాఫ్ట్‌లు, నగదు సేకరణ, వాటిని బ్యాంకులో జమ చేయడం వంటి బాధ్యతలను ఎస్బీఐకి అప్పగించినట్లు.. ఈ మేరకు బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని