Bhagwant Mann: ‘మా పోలీసులు చూసుకోగలరు’: జెడ్‌ ప్లస్ భద్రత వద్దన్న సీఎం

సొంత రాష్ట్రం పంజాబ్‌, అలాగే దిల్లీలో తనకు జెడ్‌ ప్లస్ భద్రత వద్దని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌(Punjab CM Bhagwant Mann) అన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. 

Updated : 01 Jun 2023 16:17 IST

చండీగఢ్‌: తన భద్రత విషయంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆఫర్‌ను  పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌(Punjab CM Bhagwant Mann) తిరస్కరించారు. తనకు కేంద్రం ప్రకటించిన జెడ్‌ ప్లస్ సెక్యూరిటీ(Z Plus Security)ని వద్దనుకున్నారు. తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం ఉందని వెల్లడించారు. పంజాబ్, దిల్లీలో వారు తనకు రక్షణగా ఉంటారని చెప్పారు. 

 ఇటీవల ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలు, నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆయనకు జెడ్‌ ప్లస్ రక్షణ కల్పించాలని గతవారం కేంద్రం నిర్ణయించింది. దిల్లీ(Delhi), పంజాబ్‌(Punjab)లో ఈ భద్రతను తిరస్కరించిన ముఖ్యమంత్రి.. తనకు పంజాబ్ పోలీసులు(Punjab Police) అందించే రక్షణ సరిపోతుందన్నారు. అలాగే రెండు రకాల భద్రతా ఏర్పాట్లు ఉండటం వల్ల గందరగోళం ఏర్పడుతుందని హోం శాఖకు రాసిన లేఖలో వెల్లడించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో అందించవచ్చని చెప్పారు. 

సరిహద్దులో భద్రతాపరంగా కీలక రాష్ట్రమైన పంజాబ్‌ ముఖ్యమంత్రికి జెడ్‌ ప్లస్‌ కవర్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. మాజీ ముఖ్యమంత్రులు ప్రకాశ్‌ సింగ్ బాదల్‌, కెప్టెన్ అమరీందర్ సింగ్‌, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖబీర్‌ సింగ్ బాదల్, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మాజిథియాకు ఈ భద్రతను కల్పించారు. ఇందుకోసం రక్షణగా 55 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని