Tejashwi Yadav: తేజస్వీ ర్యాలీలో మోదీ తల్లికి అవమానం: భాజపా ఆరోపణలు

Eenadu icon
By National News Team Updated : 21 Sep 2025 16:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని మోదీ (PM Modi) తల్లిపై ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ర్యాలీలో కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా (BJP) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్ యాత్రలో కూడా ఆమెకు అవమానం జరిగిందంటూ ఆరోపించింది.

ఎన్నికల నేపథ్యంలో తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) ‘బిహార్‌ అధికార్‌ యాత్ర’ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మోదీ తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భాజపా ఆరోపించింది. ‘తేజస్వీ తన ర్యాలీలో ప్రధాని మాతృమూర్తిని అవమానించాడు. ఆర్జేడీ కార్యకర్తలు దుర్భాషలాడారు. వారిని నిలువరించకపోగా తేజస్వీ వారిని ప్రోత్సహించాడు. తల్లులను, సోదరీమణులను అవమానించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌- ఆర్జేడీల ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. బిహార్‌ ప్రజలు దీన్ని మరచిపోరు. వీటన్నింటికీ గట్టిగా బదులిస్తారు’ అని రాసుకొచ్చింది. దీనికి తేజస్వీ మాట్లాడిన వీడియోను కూడా పంచుకుంది. 

అయితే, భాజపా ఆరోపణలను ఆర్జేడీ నేతలు ఖండించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే డా.ముఖేషన్‌ రౌషన్‌ మాట్లాడుతూ.. తేజస్వీ, కార్యకర్తలు ఎవరూ మోదీ తల్లిని అవమానించలేదన్నారు. వీడియోను మార్ఫింగ్‌ చేశారన్నారు. ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ పేరుతో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన యాత్రలో కొందరు కాంగ్రెస్‌ వ్యక్తులు మోదీ తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ భాజపా గతంలో ఆరోపణలు చేసింది. దీనిపై మోదీ కూడా స్పందించారు. ఆర్జేడీ- కాంగ్రెస్‌లు నిర్వహించిన పలు సమావేశాల్లోను, వేదికల పైనా చనిపోయిన తన తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆమెకు అవమానం జరిగిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన తల్లికి మాత్రమే జరిగిన అవమానం కాదని, బిహార్‌ ప్రజలకు జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు. 

Tags :
Published : 21 Sep 2025 15:59 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని