LS polls: లోక్‌సభ తుది దశ పోరు.. ముగిసిన ప్రచారం గడువు

ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.

Updated : 30 May 2024 19:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏడో దశ ఎన్నికల ప్రచార గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. తుది దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్‌సభ నియోజకవర్గాలు జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ సీట్లకు పోలింగ్‌ ముగిసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో తొమ్మిది, బిహార్‌లో ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో నాలుగు, ఝార్ఖండ్‌లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్‌ జరగనుంది. జూన్‌ 4 కౌంటింగ్‌ ఉంటుంది.

మునుపటి ఎన్నికలతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి దాదాపు 200లకుపైగా బహిరంగ సభలు, రోడ్‌ షోలలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసికి కూడా తుది దశలోనే పోలింగ్‌ జరగనుంది.

అదే రోజు ఎగ్జిట్ పోల్స్‌ (exit polls)

తుది విడత పోలింగ్‌ శనివారంతో ముగియనుండడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ (exit polls) అంచనాలు వెలువడనున్నాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ప్రముఖ మీడియా/ ప్రైవేటు సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఈ అంచనాలను వెలువరించనున్నాయి. తుది ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి. దేశంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారం చేపడుతుందా? అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అనేది ఆ రోజు తేలుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని