Chandrayaan-3: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌.. ఆ ‘17 నిమిషాలు’ టెన్షన్‌ టెన్షన్‌..!

జాబిల్లి ఉపరితలంపై మన ల్యాండర్‌ అడుగుపెట్టే క్రమంలో చివరి క్షణాలు అత్యంత కీలకమైనవని ఇస్రో అధికారులు చెబుతున్నారు. దాన్ని ‘17 నిమిషాల టెర్రర్‌’గా అభివర్ణిస్తున్నారు.

Updated : 22 Aug 2023 15:24 IST

బెంగళూరు: జాబిల్లి (Moon)పై మన వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్‌ భారతీయులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండింగ్‌ మాడ్యూల్‌ చంద్రుడికి మరింత చేరువైంది. అయితే ఇది సాఫ్ట్‌ ల్యాండింగ్‌ (Soft Landing) అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు (17 Minutes of Terror) అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం ల్యాండింగ్‌ మాడ్యూల్‌ను నిరంతర తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ఈ ప్రక్రియ మొదలుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రక్రియను ‘17 నిమిషాల టెర్రర్‌’గా ఇస్రో అధికారులు, నిపుణులు పేర్కొన్నారు. 

ఈ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైనది. సరైన ఎత్తులో సరైన సమయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకుని ల్యాండర్‌ తన ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సురక్షిత ల్యాండింగ్‌ కోసం సరైన ప్రదేశాన్ని స్కాన్‌ చేసుకుంటుంది. ఇదంతా ల్యాండర్‌ స్వయంగా చేసుకోవాల్సిందే.

ల్యాండింగ్‌ ప్రక్రియ ఇలా..

  • ల్యాండర్‌ మాడ్యూల్‌లో పారామీటర్లు అన్నింటినీ తనిఖీ చేసి, ఎక్కడ ల్యాండ్‌ అవ్వాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ నుంచి ఇస్రో సంబంధిత కమాండ్లను ల్యాండర్‌ మాడ్యూల్‌కు అప్‌లోడ్‌ చేస్తుంది. షెడ్యూల్డ్‌ ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ఇది జరుగుతుంది.
  • సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల ఎత్తులో ల్యాండర్ పవర్‌ బ్రేకింగ్‌ దశలోకి అడుగుపెడుతుంది. ఇక్కడి నుంచి చివరి 17 నిమిషాలు చాలా ఉత్కంఠగా కొనసాగుతాయి.
  • జాబిల్లి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్‌ తన నాలుగు ఇంజిన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటుంది. ల్యాండర్‌ కుప్పకూలకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
  • జాబిల్లి ఉపరితలానికి వెళ్లే సమయంలో ల్యాండర్‌ వేగం సెకనుకు 1.68 కి.మీలుగా ఉంటుంది. ఒక విమానం వేగం కంటే ఇది 10 రెట్లు ఎక్కువ.
  • జాబిల్లి ఉపరితలానికి 6.8 కి.మీల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్‌ తన రెండు ఇంజిన్లను ఆఫ్‌ చేసి.. మరో రెండు ఇంజిన్లనే ఉపయోగించుకుని వేగాన్ని తగ్గించుకుంటుంది. రివర్స్‌ థ్రస్ట్‌తో మరింత కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.
  • అప్పటికీ ల్యాండర్‌ ఇంకా జాబిల్లి ఉపరితలానికి సమాంతరంగానే ఉంటుంది. దీన్ని ‘రఫ్‌ బ్రేకింగ్‌ దశ’ అంటారు. ఇదంతా 11 నిమిషాల పాటు సాగుతుంది.
  • ఆ తర్వాత ల్యాండర్‌ ‘ఫైన్‌ బ్రేకింగ్‌ దశ’లోకి అడుగుపెడుతుంది. ఇక్కడ చంద్రయాన్‌-3 90 డిగ్రీలు వంపు తిరుగుతుంది. అప్పుడు చంద్రుడి ఉపరితలంపై నిలువు స్థానానికి వస్తుంది. గతంలో ఇక్కడే చంద్రయాన్‌-2 నియంత్రణ కోల్పోయి క్రాష్‌ అయ్యింది.
  • అలా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్‌ నిలువు, అడ్డం వేగాలు సున్నాకు తగ్గుతాయి. అప్పుడు ల్యాండర్‌ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తుంది.
  • ఆ తర్వాత ల్యాండర్‌ మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు వస్తుంది. అప్పుడు మరోసారి ల్యాండింగ్‌ కోసం ఎగుడు దిగుళ్లు, బండరాళ్లు లేని ప్రదేశం కోసం వెతుకుతుంది.
  • అన్నీ అనుకూలంగా కన్పిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండర్‌ జాబిల్లిపై అడుగుపెడుతుంది. అప్పుడు దాన్ని కాళ్లు సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉపరితలాన్ని తాకుతాయి.
  • ల్యాండర్‌ కాళ్లకు అమర్చిన సెన్సర్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఆ 17 నిమిషాల టెన్షన్‌కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది.

ల్యాండర్‌ జాబిల్లిపై దిగిన తర్వాత దాని ఒక తలుపు తెరుచుకుంటుంది. అందులో నుంచి రోవర్‌ జారుకుంటూ కిందకు వస్తుంది. ఆ తర్వాత ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తుంది. ల్యాండర్‌, రోవర్‌ మొత్తం 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తాయని ఇస్రో వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని