Chardham Yatra: చార్‌ధామ్‌ యాత్ర రెండు రోజుల పాటు నిలిపివేత.. 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులు పొంగి ప్రవహిస్తుండటం, కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రోజుల పాటు చార్‌ధామ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Published : 14 Aug 2023 15:06 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌(Uttarakhand)ను మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా అక్కడ కురుస్తోన్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఈ భారీ వర్షాల కారణంగా ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు పలుచోట్ల కొండచరియలు(Landslides) విరిగిపడటంతో జాతీయ రహదారులు బ్లాక్‌ అయ్యాయి.  ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర(Chardham)ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.  దేహ్రాదూన్‌, నైనిటాల్‌ సహా ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌ తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 60మంది మరణించగా.. 17మంది గల్లంతయ్యారు. మరోవైపు,  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం పుష్కర్ సింగ్ ధామి జిల్లా మెజిస్ట్రేట్‌లతో ఫోన్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

దేహ్రాదూన్‌, పౌరి, టెహ్రి, నైనిటాల్‌, చంపావత్‌, ఉధం సింగ్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 14, 15 తేదీల్లో  చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, కొన్నిచోట్ల  కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి వంటి పవిత్రపుణ్యక్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారులు బ్లాక్‌ అయ్యాయి. రుద్రప్రయాగ్‌, దేవ్‌ప్రయాగ్‌, శ్రీనగర్‌లలో గంగా, మందాకిని, అలక్‌నంద నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండగా.. కొన్ని చోట్ల కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో  జాతీయరహదారులు మూసివేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని