Polling Update: ముగిసిన పోలింగ్‌.. మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % నమోదు

సాయంత్రం 5 గంటల వరకు మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87% చొప్పున పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

Updated : 07 Nov 2023 18:31 IST

ఐజ్వాల్‌/రాయ్‌పుర్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మిజోరం (Mizoram Assembly Elections)లోని 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాల్లో సాయంత్రం 5గంటల వరకు 77.04శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ సెర్చిప్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో 83.96శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లియాంజలా వెల్లడించారు. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) తొలి విడతలో 20 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. సాయంత్రం 5గంల వరకు 70.87శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించినప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లాలో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక పోలింగ్ విషయానికి వస్తే.. ఖైరాగఢ్‌-చుయుఖదాన్‌- గండయి జిల్లాలో అత్యధికంగా 76.31శాతం  పోలింగ్‌ నమోదైంది. అలాగే,  అంబాగఢ్‌ చౌకి జిల్లాలో76శాతం; బస్తర్‌ (జగ్దల్‌పుర్‌)లో 72.41శాతం, కబీర్‌ధామ్‌ జిల్లాలో 72శాతం, కొండగాన్‌లో 75.35శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది. ఛత్తీస్‌గఢ్లో తొలి విడతలో పోలింగ్‌ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా.. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17 పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని