Polling Update: మిజోరంలో 52.73శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 44.55 శాతం పోలింగ్‌ నమోదు

మధ్యాహ్నం 1 గంట వరకు మిజోరంలో 52.73శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 44.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 07 Nov 2023 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.  మధ్యాహ్నం 1 గంట వరకు 52.73 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సెర్చిప్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో 60.37శాతం పోలింగ్‌ నమోదు కాగా, లౌంగల్లాయ్ జిల్లాలో 59.31 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి లియాంజలా వెల్లడించారు. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), ప్రధాన ప్రతిపక్షం జోరం పీపుల్స్‌ మూమెంట్‌ (జడ్‌పీఎం) అన్ని స్థానాలకూ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. భాజపా 20, ఆప్‌ 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. 

ఛత్తీస్‌గఢ్‌లో ఉద్రిక్తతల నడుమ..

ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) తొలి విడతగా 20 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 44.55 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సుక్మా జిల్లాలో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్‌ కమాండో తీవ్రంగా గాయపడ్డారు. అదే జిల్లాలోని బాండా పోలింగ్‌ స్టేషన్‌ సమీపంలో నక్సలైట్లకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయణ్‌పుర్‌ జిల్లాలోని ఓర్చా పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు. అయితే, ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్‌ కొనసాగిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. తొలి విడతలో పోలింగ్‌ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా.. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17 పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని