Congress: ‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్‌ మండిపాటు

ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది.

Published : 29 Mar 2024 13:59 IST

దిల్లీ: రూ.1823 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను విభాగం (IT Dept) నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఐటీ శాఖను ఉపయోగించుకుని కాంగ్రెస్‌ సహా భావసారూప్యత కలిగిన విపక్ష పార్టీలను కాషాయ పార్టీ లక్ష్యంగా చేసుకుంటోందని.. ఈ పన్ను ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేసింది. ఐటీ శాఖ నుంచి వచ్చిన తాజా నోటీసులపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌, పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

‘పన్ను చట్టాలను భాజపా తీవ్రంగా ఉల్లంఘిస్తోంది. అందుకు ఆ కాషాయ పార్టీ నుంచి రూ.4600 కోట్లు వసూలు చేయాలి. అసంబద్ధ కారణాలతో పాత రిటర్నులను తిరిగి తెరిచి కాంగ్రెస్‌ పార్టీపై ఐటీ శాఖ దుష్ప్రచారానికి పాల్పడుతోంది’ అని అజయ్‌ మాకెన్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు ఐటీశాఖను భాజపా పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందన్నారు.

‘ఎలక్టోరల్‌ బాండ్ల స్కాంను ఉపయోగించి భాజపా రూ.8200 కోట్లు వసూలు చేసింది. పన్ను ఉగ్రవాదం (Tax terrorism)లో ఆ పార్టీ నిమగ్నమైంది. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రయత్నం జరుగుతోంది. కానీ, మేం భయపడే ప్రసక్తే లేదు’ అని జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారాన్ని కొనసాగిస్తుందని, పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజే 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1800 కోట్లకుపైగా డిమాండ్‌ నోటీసులను ఐటీ పంపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని