Rajnath Singh: ‘పీవోకే భారత్‌లో విలీనమవుతుంది’.. విశ్వాసం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌

పీవోకేపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.   

Updated : 24 Mar 2024 20:55 IST

దిల్లీ: భారత్‌లో విలీనం కావాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పీవోకే ప్రజలు భారత్‌లో విలీనం అవుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు. కశ్మీర్‌పై పాక్‌ ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు.

‘కశ్మీర్‌ను వాళ్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా? పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించి వాళ్లు ఆందోళన చెందాలి. అక్కడ దాడి చేసి ఆక్రమించుకునే అవసరం మనకు ఉండదని ఏడాదిన్నర క్రితమే చెప్పాను. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. భారత్‌లో విలీనం కావాలని పీవోకే ప్రజలే స్వయంగా డిమాండు చేస్తున్నారు’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పీవోకేకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక రూపొందిస్తోందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. చెప్పకూడదు. ఏ దేశంపైనా మనం దాడి చేయం. ప్రపంచంలో ఏ దేశంపైనా దాడి చేయడం/ ఇతర దేశాల నుంచి అంగుళం భూమి కూడా ఆక్రమించుకునే లక్షణం భారత్‌కు లేదు. కానీ, ఎవరైనా మనపై దాడి చేస్తే వాళ్లని వదిలే ప్రసక్తే లేదు. పీవోకే విషయానికొస్తే.. గతంలో, ఇప్పుడూ అది మనదే. భారత్‌లో విలీనమవుతుందనే విశ్వాసం ఉంది’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

సైనికులతో సందడి..

హోలీ సందర్భంగా లద్దాఖ్‌లోని లేహ్‌ సైనిక స్థావరాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లు, ఇతర సీనియర్‌ సిబ్బందితో మాట్లాడారు. ‘‘దిల్లీ మన దేశ రాజధాని. ముంబయి మన ఆర్థిక రాజధాని. వీటి మాదిరిగానే లద్దాఖ్ మన శౌర్యానికి రాజధాని’’ అని పేర్కొన్నారు. హోలీ పండుగ కోసం ఇక్కడికి రావడం తన జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని