Modi: మోదీ ప్రమాణస్వీకారం వేళ.. దిల్లీలో హైఅలర్ట్‌

మోదీ(Modi) ప్రమాణస్వీకార కార్యక్రమం వేళ.. దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Published : 08 Jun 2024 15:38 IST

దిల్లీ: మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ (Modi) ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దాంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు.

ఈ కార్యక్రమానికి పొరుగుదేశాలకు చెందిన అధినేతలు రానున్నారు. వారు నిర్దేశించిన మార్గాల్లోనే హోటల్‌ నుంచి వేదిక వద్దకు వస్తారని అధికారులు తెలిపారు. ఆ మార్గాల్లో స్నైపర్లు, పోలీసు సిబ్బంది పహారా కాయనున్నారు. కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు. అలాగే నేతలు బస చేసే హోటళ్లు ఇప్పటికే కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నాయి. స్కానింగ్‌ వంటి వాటికోసం కృత్రిమమేధ సాంకేతికతను వినియోగిస్తున్నారు.

ఇక రాష్ట్రపతి భవన్‌ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు. మోదీ సహా ఉన్నతస్థాయి వ్యక్తుల రాకపోకల వేళ.. వేదిక వద్దకు వెళ్లే పలు మార్గాలను మూసివేసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం నుంచే ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. అలాగే దిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 8 వేల మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని