DK Shivakumar: ప్రయత్నాలు ఫలించకపోయినా..: ‘సీఎం కుర్చీ’పై డీకే శివకుమార్‌ వ్యాఖ్య

Eenadu icon
By National News Team Updated : 04 Jul 2025 17:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో సీఎం మార్పుపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగింపులతో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ (DK Shivakumar) సర్దుకుపోవడంతో.. ప్రస్తుతానికి సమస్య తీరిపోయింది. అయితే సీఎం కావాలన్న తన కోరిక అలాగే ఉందనే అర్థంలో డీకే తాజాగా వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఆకాంక్షలపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

‘‘ప్రయత్నాలు ఫలించకపోయినా.. నేను బలంగా కోరుకున్న దాని కోసం చేసిన ప్రార్థనలకు సమాధానం దొరక్కుండాపోదు. అయితే రాజకీయాల గురించి చర్చించే సందర్భం ఇది కాదు. రాష్ట్రానికి మంచి జరగాలి’’ అంటూ తన ఆకాంక్షలను నేరుగా బయటపెట్టకుండా సమాధానం చెప్పారు డీకే. మల్లికార్జున ఖర్గే తమకు జాతీయ అధ్యక్షుడని, ఆయన సూచనల ప్రకారం పార్టీ కోసం పనిచేస్తామన్నారు.

ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందన్నారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే.. ఐదేళ్లు తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య (Siddaramaiah) స్పష్టంచేయడంతో ఆ ఊహాగానాలకు చెక్ పడింది. ఆ సమయంలో డీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఆయన(సీఎం)కు అండగా ఉండటం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు. నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. అధిష్ఠానం ఏం చెబితే అది చేయాలి’’ అని మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారని వార్తలూ వచ్చాయి. పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెర పైకి వస్తున్నాయి. తాను కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని డీకే బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే.

Tags :
Published : 04 Jul 2025 17:18 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు