Delhi: సిద్ధూ, డీకేల ప్రత్యేకాధికారుల మధ్య ఘర్షణ.. దిల్లీలో పరస్పర దాడులు

Eenadu icon
By National News Team Updated : 26 Jul 2025 14:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: ‘సీఎం మార్పు’ అంశంపై కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య (Siddaramaiah) చెబుతున్నా.. తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్‌ (DK Shivakumar) అంటున్నా సీఎం పీఠం విషయంలో సిద్ధూ, డీకే వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరో కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇటీవల దిల్లీలోని కర్ణాటక భవన్‌లో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల ప్రత్యేక అధికారులు పరస్పరం దాడి చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి.

పార్టీ వర్గాల ప్రకారం.. సిద్ధరామయ్య వద్ద  ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మోహన్‌కుమార్ (Mohan Kumar) అనే అధికారి తనను షూతో కొట్టినట్లు శివకుమార్‌ వద్ద పనిచేసే ప్రత్యేక అధికారి ఆంజనేయ (Anjaneya) ఆరోపించారు. షూతో కొట్టి పార్టీ నేతల ముందు తన గౌరవానికి భంగం కలిగించినందువల్ల.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా మోహన్‌కుమార్‌కు పలువురు ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ విషయం తన దృష్టికి వచ్చిందని రెసిడెంట్ కమిషనర్‌ ఇమ్‌కోంగ్ల జమీర్‌ తెలిపారు.

ఆంజనేయ తనతో దురుసుగా ప్రవర్తించినట్లు సీఎం ప్రత్యేక అధికారి మోహన్‌కుమార్ ఆరోపించారు. ఆయనే తన ఛాంబర్‌లోకి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కార్యాలయంలోని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అడుగగా ఇరువురు అధికారుల మధ్య జరిగిన ఘర్షణ విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకున్నాక దీనిపై మాట్లాడతానని పేర్కొంటూ సమాధానం దాటవేశారు. అయితే పదోన్నతులు, పోస్టింగ్‌ల విషయంలో ఇరువురు అధికారుల మధ్య పలుమార్లు విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సీఎం మార్పు వార్తల వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags :
Published : 26 Jul 2025 13:44 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని