Bombay HC: ఇంద్రాణీ ముఖర్జీ డాక్యుమెంటరీ విడుదలకు తాత్కాలిక బ్రేక్‌

‘ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: ది బర్రీడ్‌ ట్రూత్‌’ పేరుతో ఓటీటీలో రానున్న డాక్యుమెంటరీ (OTT) విడుదలకు బాంబే హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది.

Updated : 22 Feb 2024 14:48 IST

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీపై (Indrani Mukerjea) రూపొందిన ఓ డాక్యుమెంటరీ (OTT) విడుదలకు బాంబే హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. ఫిబ్రవరి 29 వరకు దీనిని విడుదల చేయొద్దని నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. అంతలోపు ఈ డాక్యుమెంటరీని సీబీఐ, కోర్టు కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలని సూచించింది.

‘ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: ది బర్రీడ్‌ ట్రూత్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ఫిబ్రవరి 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమైంది. అయితే, దర్యాప్తు పూర్తయ్యేవరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ బాంబే హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. విచారించిన డివిజన్‌ బెంచ్‌.. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. దీనికి నెట్‌ఫ్లిక్స్‌ అంగీకరించింది. తదుపరి విచారణ (ఫిబ్రవరి 29) వరకు విడుదల చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది.

2012లో తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టై సుమారు ఆరున్నరేళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణీ.. 2022 మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై ఇటీవల ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ రూపొందింది. అయితే, దర్యాప్తు కొనసాగుతున్నందున.. అది పూర్తయ్యేవరకు ఈ సిరీస్‌ విడుదల చేయొద్దని సీబీఐ వాదిస్తోంది. సీబీఐ ప్రకారం, ఈ కేసులో మొత్తం 237 మంది సాక్షులకు గాను ఇప్పటివరకు 89 మందిని విచారించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని