Jaishankar: టెక్నాలజీతో భారత వృద్ధి ముడిపడి ఉంది: జైశంకర్‌

భారత్‌ ఎదుగుదల దేశీయంగా టెక్నాలజీ అభివృద్ధితో ముడిపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌. ఎస్‌ జైశంకర్‌ అన్నారు.

Updated : 29 Nov 2022 13:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత ఎదుగుదల దేశీయంగా టెక్నాలజీ అభివృద్ధితో ముడిపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌. ఎస్‌ జైశంకర్‌ అన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ, కార్నెగి ఇండియా సంయుక్తంగా దిల్లీలో నిర్వహిస్తోన్న ‘ది గ్లోబల్‌ టెక్నాలజీ’ సదస్సులో ఆయన ప్రసంగించారు. మన శక్తిని బట్టే సామర్థ్యాలను నిర్ణయించే విభిన్నమైన ప్రపంచంలో మనం ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రపంచంలో డేటా ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తూ బ్రిటన్‌ గణిత శాస్త్రవేత్త క్లైవ్‌ హంబీ వ్యాఖ్యలను జైశంకర్‌ ఉటంకించారు. 18వ శతాబ్దంలో చమురు పోషించిన పాత్రను 21వ శతాబ్దంలో డేటా పోషిస్తోందని పేర్కొన్నారు. 

డేటా అత్యంత విలువైన వనరుగా జైశంకర్‌ అభివర్ణించారు. దానిని సరైన విధంగా వెలికితీయాలన్నారు. ‘‘టెక్నాలజీ, గ్లోబలైజేషన్‌లు ఆర్థిక విషయాలన్నది వాస్తవం.. కానీ, అవి రాజనీతిశాస్త్ర అంశాలు కూడా. గత రెండేళ్లుగా మన డేటా ఎక్కడ ఉంటోందన్న అంశంపై భారత్‌ దృష్టిపెట్టింది’’ అని వెల్లడించారు. టెక్నాలజీకి సంబంధించిన భౌగోళిక రాజకీయాంశాల్లో భారత్‌కు టెక్నాలజీ ఎవరు ఇస్తున్నారు, ఎవరు భాగస్వాములవుతున్నారు, మన మార్కెట్‌ ఎక్కడ ఉంది అనే అంశాలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ సదస్సు మూడు రోజులపాటు జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని