ఏక్‌నాథ్‌ శిందే హోంశాఖ కావాలని అడిగారు: శివసేన ఎమ్మెల్యే

Eenadu icon
By National News Team Published : 07 Dec 2024 10:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముంబయి: మహారాష్ట్రలో (Maharashtra) ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde), అజిత్‌ పవార్‌లకు హోదా కల్పించారు. కాగా మహాయుతిలో మంత్రిత్వశాఖల కేటాయింపులపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈనేపథ్యంలో శిందేకు సన్నిహితుడిగా పేరున్న ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన మహాయుతి ప్రభుత్వంలో తనకు హోంశాఖను అప్పగించాలని మాజీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే డిమాండ్‌ చేశారని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే పేర్కొన్నారు. ఏక్‌నాథ్‌ శిందే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు హోంశాఖ అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే డిసెంబరు 11-16 మధ్య కేబినెట్‌ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. నాగ్‌పూర్‌లో డిసెంబర్ 16న శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

గత మహాయుతి ప్రభుత్వంలో శివసేనకు ఉన్న శాఖలను మార్చేందుకు కూటమిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో శివసేన ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా శిందే నేతృత్వంలోని మునుపటి ప్రభుత్వంలో మాదిరిగానే ఎన్సీపీ తమ దగ్గరున్న ఆర్థికశాఖను, భాజపా హోంశాఖను నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

288 శాసనసభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 230 స్థానాలతో భారీ మెజార్టీ దక్కించుకుంది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది. సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై భాజపా, శివసేన, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించని ఏక్‌నాథ్‌ శిందే, హోంశాఖ కేటాయించాలని పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, సీఎంగా భాజపా నేతే ఉంటారని ముందునుంచీ ప్రచారం జరిగినా ఫడణవీస్‌ స్థానంలో ఇంకెవరినైనా తీసుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, పార్టీ అధిష్ఠానం మాత్రం ఆయన వైపే మొగ్గు చూపింది. దీంతో ముఖ్యమంత్రిగా మూడోసారి ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు