Eknath Shinde: త్వరలో మీ పార్టీ మూసుకోవాల్సి వస్తుంది: కునాల్ వ్యాఖ్యల వివాదంపై శిందే

Eenadu icon
By National News Team Published : 26 Mar 2025 18:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా (Kunal Kamra) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) మరోసారి స్పందించారు. ఎవరిదగ్గరో తీసుకున్న సుపారీ కారణంగానే తనపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘మీరు నన్ను పదేపదే గద్దార్, గద్దార్ అని పిలుస్తున్నారు. త్వరలో మీరు మీ పార్టీ తలుపులు మూసివేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, స్పీకర్‌తో పాటు ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. మీరు ఎంత సుపారీ ఇచ్చినా.. అది పనిచేయదు’’ అని శివసేన(యూబీటీ)ని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు.

ఇటీవల ముంబయిలోని యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ కామెడీ స్టూడియోలో కునాల్‌ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించి దానిని రికార్డు చేశారు. ఇందులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేను ‘‘గద్దార్‌’’ (ద్రోహి) గా అభివర్ణిస్తూ ‘దిల్‌తో పాగల్‌ హై’ హిందీ చిత్రంలోని ఒక సినీ గీతానికి పేరడీని కామ్రా ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్‌ స్టూడియోపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు.

ఈ పరిణామాలపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ శిందే స్పందించారు. ‘‘ఇలాంటి పనులు చేయడానికి ఆయన (కునాల్‌) ఎవరి నుంచి సుపారీ తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యం. కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. నా గురించి మర్చిపోండి.. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి, హోం మంత్రి గురించి ఏం మాట్లాడారో చూడండి. అలాగే నేను విధ్వంసాన్ని సమర్థించను’’ అని శిందే అన్నారు

శిందే (Eknath Shinde)పై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా చేసిన పేరడీపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణలో భాగంగా పోలీసులు సమన్లు జారీ చేస్తున్న సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని ఉద్దేశిస్తూ కునాల్‌ (Kunal Kamra) మరో పాట పాడారు. ‘మిస్టర్‌ ఇండియా’ సినిమాలోని హవా హవాయి పాటను పేరడీ చేసిన ఆయన.. పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతోందంటూ అందులో ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు