Election Commissioners: కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌

Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుల్లో ఒకరైన అధీర్‌ రంజన్‌ చౌధరీ వెల్లడించారు.

Updated : 14 Mar 2024 14:08 IST

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission)లో ఖాళీ అయిన కమిషనర్ల (Election Commissioners) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైంది. కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే.. కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ (Adhir Ranjan Chowdhury) పేర్లను బయటపెట్టారు. ఈసీలుగా మాజీ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు మీడియాకు వెల్లడించారు.

నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది. అనంతరం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇందులో అధిర్‌తో పాటు కేంద్రహోం మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు.

‘జమిలి ఎన్నికల’పై 18వేల పేజీల నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

ఈ భేటీ అనంతరం అధిర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కమిటీలో ప్రభుత్వానికే మెజార్టీ ఉంది. తొలుత నాకు 212 పేర్లను పంపించారు సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారు. చివరకు పంజాబ్‌కు చెందిన సంధూ, కేరళకు చెందిన జ్ఞానేశ్‌ను ఎంపిక చేశారు. ఇది ఏకపక్షమని నేను చెప్పను. కాకపోతే ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ సభ్యులుగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

గత నెల ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ‘కేంద్ర ఎన్నికల కమిషనర్‌’ (సీఈసీ), ‘ఎన్నికల కమిషనర్‌’ (ఈసీ)ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం (మార్చి 15) విచారణ జరపనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని