Kangana Ranaut: 2 నిమిషాల ఫేమ్‌ కోసం.. కునాల్‌ కామ్రా వ్యాఖ్యలపై స్పందించిన కంగనా

Eenadu icon
By National News Team Updated : 25 Mar 2025 13:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)ను ఉద్దేశించి స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా (Kunal Kamra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా దీనిపై భాజపా ఎంపీ, బాలివుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) స్పందించారు. కేవలం 2 నిమిషాల ఫేమ్‌ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎక్కడికి వెళ్తుందో మనం ఆలోచించాలన్నారు. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘కేవలం 2 నిమిషాల ఫేమ్‌ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎక్కడికి వెళ్తుందో మనం ఆలోచించాలి. మాట్లాడింది ఎవరైనా కావచ్చు. కానీ, ఒకరిని అవమానించడం,  వారి పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం సరికాదు. విమర్శించాలనుకుంటే సాహిత్య ప్రక్రియ ద్వారా ఆ పని చేయవచ్చు. కానీ, కామెడీ అనే పేరుతో మన సంస్కృతిని, ప్రజలను దూషిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి ఆ వేదికను కూల్చడం చట్టబద్ధంగానే జరిగింది. కానీ, నా విషయంలో మాత్రం చట్టవిరుద్ధంగానే జరిగింది’ అని కంగనా పేర్కొన్నారు. 

గతంలో నటుడు సుశాంత్‌సింగ్‌ కేసు దర్యాప్తు గురించి కంగనా మాట్లాడుతూ.. మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే భయంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇవి కాస్తా రాజకీయ దుమారం రేపాయి. దీనిపై ప్రస్తుత శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌కు, కంగనాకు మధ్య కొన్నిరోజుల పాటు మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) బాంద్రాలోని నటి కార్యాలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసింది. దీనిపై కంగనా ముంబయి కోర్టును ఆశ్రయించారు. బీఎంసీపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నటికి జరిగిన నష్టాన్ని పూడ్చాలని తీర్పునిచ్చింది. తాజాగా ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావించారు. 

ఇటీవల హబిటాట్‌ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏక్‌నాథ్‌ శిందేపై కునాల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చడంతో పాటు.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో శివసేన శిందే వర్గం కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో 12 మందిని అరెస్టు చేశారు. మరోవైపు పోలీసులు సోమవారం కునాల్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈక్రమంలోనే బీఎంసీ ఉద్యోగులు భారీ పరికరాలతో అక్కడికి చేరుకొని స్టూడియోలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

Tags :
Published : 25 Mar 2025 12:57 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు