Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ లాయర్‌ శాంతిభూషణ్‌(Shanti Bhushan) ఇక లేరు. ఈ రోజు రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

Updated : 31 Jan 2023 20:56 IST

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శాంతి భూషణ్‌(Shanti Bhushan)(97) కన్నుమూశారు. మంగళవారం రాత్రి 7గంటల సమయంలో దిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్‌ హైకోర్టులో రాజ్‌నారాయణ్‌ తరఫున న్యాయవాదిగా శాంతిభూషణ్‌ వాదనలు వినిపించారు. అనేక కీలక అంశాలపై దాఖలైన ప్రయోప్రయోజనాల వ్యాజ్యాలపై వాదనలు వినిపించిన ఆయన.. అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించిన న్యాయవాదిగా ప్రఖ్యాతి గాంచారు. పౌర స్వేచ్ఛకు ఆయనను ఛాంపియన్‌గా పేర్కొంటారు. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం ఏర్పాటైన జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు న్యాయశాఖ మంత్రిగానూ సేవలందించారు. 1980లో ఆయన ప్రఖ్యాత ఎన్జీవో ‘సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌’ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ సుప్రీంకోర్టులో పలు కీలక పిల్‌లను దాఖలు చేస్తుంటుంది. ఆయన తనయుడు ప్రశాంత్‌ భూషణ్‌ కూడా సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు.

ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో 1925 నవంబర్‌ 11న జన్మించిన శాంతి భూషణ్‌.. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. కాంగ్రెస్‌(ఓ)లో క్రియాశీలంగా ఉన్న ఆయన.. ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు.  1977 జులై నుంచి 1980 ఏప్రిల్‌ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన సమయంలోనే మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో 1977 నుంచి 1979 మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. 1980లో భాజపాలో చేరినప్పటికీ ఆ తర్వాత ఆరేళ్లకే రాజీనామా చేశారు. 2012 నవంబర్‌లో ఏర్పాటైన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పాటులోనూ శాంతి భూషణ్‌ కీలకంగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని