Manohar Joshi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి కన్నుమూత

Manohar Joshi: లోక్‌సభ మాజీ స్పీకర్‌ మనోహర్‌ జోషి (86) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

Updated : 23 Feb 2024 08:01 IST

Manohar Joshi | ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబయిలోని పి.డి.హిందుజా ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం ముంబయిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. గత ఏడాది మేలోనూ మెదడులో రక్తస్రావం కారణంగా హాస్పిటల్‌లో చేరారు.

శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్‌ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ వ్యవహరించారు. 1937 డిసెంబర్‌ 2న నాంద్వీలో జోషి జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబయిలో సాగింది. సతీమణి అనఘ మనోహర్‌ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్‌ జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. స్టాండింగ్‌ కమిటీ (మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. 1967-77 మధ్య ముంబయి మేయర్‌గా పనిచేశారు. 1972లో మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడు దఫాలు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబయి నార్త్‌-సెంట్రల్‌ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని