84 ఏళ్ల వయసులో ‘పద్మశ్రీ’.. పక్కా ఇల్లు మాత్రం రాలే!

చిన్నవయసులో భర్తను పోగొట్టుకున్న ఆమె.. కుటుంబాన్ని పోషించడం కోసం నిర్మాణరంగంలో కూలీగా మారారు. కళ మీద ప్రేమతో 70 ఏళ్ల వయసులో చిత్రకారిణిగా రూపాంతరం చెందారు.

Published : 28 Jan 2023 04:30 IST

ప్రధాని స్పందించినా ఫలించని ఎదురుచూపులు

భోపాల్‌: చిన్నవయసులో భర్తను పోగొట్టుకున్న ఆమె.. కుటుంబాన్ని పోషించడం కోసం నిర్మాణరంగంలో కూలీగా మారారు. కళ మీద ప్రేమతో 70 ఏళ్ల వయసులో చిత్రకారిణిగా రూపాంతరం చెందారు. కాన్వాస్‌, కాగితంపై పెయింటింగులు చేసిన తర్వాత.. ఇప్పుడు బంకమట్టి, లోహం, కలప వంటి వాటిపై బైగా తెగకు సంబంధించిన చిత్రాలు వేస్తూ చిత్ర కళాకారిణిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అరుదైన కళకు ప్రాణం పోసి ఎనిమిది పదుల వయసులో ఎన్నో పురస్కారాలు అందుకొంటున్నారు. కళారంగంలో తన సేవలకు ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ అవార్డు కూడా వరించింది. ఇంత గౌరవం దక్కినా.. పక్కా ఇంటి కోసం ఈ పేదరాలి ఎదురుచూపులు ఇంకా ఫలించలేదు. మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లా లోర్హా గ్రామానికి చెందిన 84 ఏళ్ల జోధయీయా బాయీ ఈ ఏడాది దేశంలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’కి ఎంపికయ్యారు. గతేడాది ఈమె దిల్లీలో ‘నారీశక్తి’ అవార్డును కూడా అందుకున్నారు. అప్పుడు ప్రధాని మోదీని కలిసిన జోధయీయా బాయీ.. పక్కాఇల్లు లేక పడుతున్న అవస్థలను చెప్పి ఇల్లు ఇప్పించాలని అభ్యర్థించారు. ప్రధాని సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ తనకు పక్కా ఇల్లు రాలేదని ఆమె చెప్పారు. ‘‘ఉమేరియాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగా. భోపాల్‌కూ వెళ్లా. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన లబ్ధిదారుల్లో నా పేరు లేదని అధికారులు చెబుతున్నారు. వంటగ్యాస్‌ రాయితీ ఉంది. ఇతర పథకాలు అందుతున్నాయి. కానీ, పక్కాఇల్లు మాత్రం లేదు. ఇప్పటికీ మట్టితో కట్టిన ఇంట్లోనే ఉంటున్నా’’ అని జోధయీయా బాయీ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని