NEET PG 2023: ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. నీట్‌ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పెంపు

ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు శుభవార్త. నీట్‌ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించింది.

Updated : 08 Feb 2023 08:06 IST

 ఆగస్టు 11 వరకు పొడిగించిన కేంద్రం
 తెలంగాణ సహా పలు రాష్ట్రాల విద్యార్థులకు ఊరట

దిల్లీ: ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు శుభవార్త. నీట్‌ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించింది. ఆ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌(ఏడాది కాలం) కటాఫ్‌ తేదీని ఆగస్టు 11 వరకు కేంద్రం పొడిగించింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యేవారే నీట్‌ పీజీ-2023 పరీక్షకు అర్హులని కేంద్రం తొలుత పేర్కొంది. ఆ కటాఫ్‌ గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తూ గత నెల 13న నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

అయితే కొవిడ్‌ మహమ్మారి కారణంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ గతేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్‌ 30 లోపు అది పూర్తవ్వదు. ఫలితంగా చాలామంది విద్యార్థులు నీట్‌ పీజీ పరీక్ష రాసేందుకు అనర్హులుగా మారే ముప్పు ఏర్పడింది. తాజా నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు 4 వేలమంది విద్యార్థులు సహా పలు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఉపశమనం లభించినట్లయింది. వీరంతా గురువారం నుంచి ఆదివారం (ఈ నెల 12) వరకు నీట్‌ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మార్చి 5న జరగనుంది. దాన్ని వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు విన్నవిస్తున్నాయి. మరోవైపు- ఎండీఎస్‌ నీట్‌ రాసేందుకు వీలుగా బీడీఎస్‌ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ తేదీని ఈ ఏడాది జూన్‌ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఎండీఎస్‌ నీట్‌ అభ్యర్థులు శుక్రవారం (ఈ నెల 10) సాయంత్రం 3 గంటల నుంచి ఆదివారం (ఈ నెల 12) అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* నీట్‌- సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు అర్హత ప్రమాణాన్ని 50 పర్సంటైల్‌ నుంచి 20 పర్సంటైల్‌కు కేంద్రం తగ్గించింది. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)తో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని